'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు.