అవినీతి రొచ్చులో బిజెపి

          'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్‌, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు. ఈ ఉదంతాలకు స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం తోడై ముచ్చెమటలు పోయిస్తున్నది. ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని, బిజెపి అగ్ర నేతలు ఆరోపణలెదుర్కొంటున్న వారందరినీ సమర్థించడమే పనిగా పెట్టుకున్నారు. ఎదుటి వారి తప్పులను ఎంచడానికి ఒంటికాలిపై లేచే బిజెపి, తనదాకా వచ్చేసరికి అవినీతిపరులను, నిందితులను వెనకేసు కొచ్చేందుకు ఏ మాత్రం జంకూ గొంకూ ప్రదర్శించట్లేదు. తాము చెప్పే నీతులు ఎదుటి వారికి తప్ప తమకు కాదన్నట్లు ఆ పార్టీ వ్యవహరించడం దారుణం. ఎవరిని ఏమంటే ఏమవుతుందో, ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనన్న భయం బిజెపి నేతలను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఆరోపణలెదుర్కొంటున్న వారిపై ఈగ వాలనీయడం లేదు. ఎన్నికల్లో బిజెపి నినాదం కుంభకోణాల కాంగ్రెస్‌ను గద్దె దించడం. అవినీతి రహిత పాలన అందించడం. మోడీ ప్రభుత్వం, సంవత్సరంలోనే ఆ హామీ నుంచి పూర్తిగా వైదొలిగింది. అవినీతి విషయంలో తమది యుపిఎ కాదని ప్రధాని చెప్పుకుంటున్నారు. దానర్థం తమది ఎన్‌డిఎ కనుక ఎంతగా అవినీతికి, క్విడ్‌ప్రోకోలకు పాల్పడినా వదిలేయమనా?
            ఇదివరలో ప్రజలకు ఢిల్లీలో అమర జవాన్ల స్మారక చిహ్నం ఇండియా గేట్‌ ఒక్కటే తెలుసు. ఇప్పుడు గేట్‌ అంటే కుంభకోణానికి పర్యాయపదం. యుపిఎ ప్రభుత్వంలో భారీ బొగ్గు స్కాంను కోల్‌గేట్‌ అన్నారు. అనంతరం రైల్వే గేట్‌ ముందుకొచ్చింది. ఎన్‌డిఎ సర్కారులో లలిత్‌ గేట్‌ బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. లలిత్‌ గేట్‌లో తొలుత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పేరు వెల్లడైంది. ఐపిఎల్‌ మాజీ అధిపతి, ఆర్థిక నేరగాడు లలిత్‌ మోడీకి బ్రిటన్‌ నుంచి పోర్చుగల్‌ వెళ్లేందుకు సుష్మా మంత్రి హోదాలో వీసాకు సిఫారసు చేసిన ఉదంతంపై బ్రిటిష్‌ మీడియా కోడై కూసింది. కేవలం మానవతా దృక్పథంతోనే వీసాకు సాయం చేశానని సుష్మా ఎంతగా తప్పించుకోవాలని చూసినా ఆమె చెప్పిన అబద్ధం అతకలేదు. లలిత్‌ మోడీ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) లలిత్‌ అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది. ఐపిఎల్‌ బెట్టింగ్‌లు, ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి లండన్‌కు పారిపోయిన వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ లలిత్‌ మోడీ. అతగాడిపై రెడ్‌, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. అలాంటి నేరస్తుడికి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన దేశానికి రప్పించి, అక్రమాలపై విచారణకు ఆదేశించాల్సింది పోయి దేశాలు తిరగడానికి వీసా ఇప్పించడమేంటి? సుష్మా కుటుంబానికి, లలిత్‌ మోడీకి సంబంధాలున్నాయి. లలిత్‌ తరఫున కోర్టుల్లో సుష్మా భర్త, కూతురు వాదిస్తున్నారు. సుష్మా క్విడ్‌ప్రోకో నిరూపణకు ఈ ఆధారాలు సరిపోతాయి. అయినా నరేంద్ర మోడీ సర్కారు, బిజెపి సుష్మాను వెనకేసుకొచ్చాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం లలిత్‌ మోడీ వీసాకు సహకరించి అడ్డంగా దొరికిపోయారు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉండి బ్రిటన్‌ ఇమ్మిగ్రేషన్‌కు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పైగా తాను సిఫారసు చేసినట్లు భారత అధికారులకు తెలపొద్దని షరతు పెట్టారు. ఆ పత్రం బయటపడ్డాక కూడా వసుంధరా రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని బిజెపి వత్తాసు పలకడం ఆమె అక్రమాలను సమర్థించడమే అవుతుంది.
                లలిత్‌ మోడీ 'అంతవాడు' కావడానికి వసుంధరా రాజేనే కారణం. ఆమె ముఖ్యమంత్రిగా అందించిన సహకారంతోనే రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి బిసిసిఐ, ఐపిఎల్‌ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు. అందుకు 'ఉడతా భక్తి'తో వసుంధర తనయుడు, బిజెపి ఎంపి అయిన దుష్యంత్‌ కంపెనీలో పది రూపాయల ముఖ విలువ చేసే షేర్‌ను రూ.96 వేల చొప్పున 815 షేర్లు కొనుగోలు చేశారు. లలిత్‌ మోడీకి, వసుంధర కుటుంబాలకు మధ్య సంబంధాలను రూఢ పర్చడానికి ఈ సాక్ష్యాలు సరిపోవా? వ్యాపార వృద్ధిని ఆశించి అత్యధిక ధరకు లలిత్‌ షేర్లు కొన్నారని బిజెపి వాదించడం ఘోరం. మహారాష్ట్రలో బిజెపి మంత్రి పంకజా ముండే అవినీతి మరీ క్షమించరానిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేద పిల్లలకు అందించే వేరుశనగ పప్పుండలు, దుప్పట్లు, చాపల కొనుగోలులో రూ.200 కోట్లకు పైగా మెక్కారు. ఒకే రోజు టెండర్లు లేకుండా వందలాది ప్రభుత్వ తీర్మానాలతో వస్తువులు కొన్నారు.

                మంత్రి పంకజాపై ఎసిబి వద్ద కేసు నమోదు కాగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిదీ సమర్థన పల్లవే. ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీది మరో వివాదం. ఎన్నికల కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్‌లో విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చిన వ్యక్తి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. లలిత్‌ గేట్‌లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపి ఇరుక్కున్నా, మహారాష్ట్ర మంత్రి భారీ స్కాంకు పాల్పడ్డా, మరో కేంద్ర మంత్రి స్మృతిపై తప్పుడు అఫిడవిట్‌ కేసు కోర్టులో విచారిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడం గర్హనీయం. కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డ వారిని పదవుల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపించినప్పుడే అవినీతి రహిత పాలన హామీకి కొంతైనా విలువ ఉంటుంది. ఆరోపణలెదుర్కొంటున్నవారిని పదవుల్లో కొనసాగించడం అనైతికం అనిపించుకుంటుంది.