పార్టీ చరిత్ర

            సిపిఐ(ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గాభారతకమ్యూని పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. . సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.

            దోపిడీ పీడనలకు వ్యతిరేకంగాఅంతర్జాతీయ ఆధిపత్య పోకడలకు ప్రతిఘటనగా 'మతోన్మాద రాజకీయాలపై రణభేరిగా' కుల వివక్షపై మోగే శంఖారావంగా ` యువతీ యువకుల ఆశయ స్వచ్ఛతకు నిదర్శనంగా` దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా అర్ధశతాబ్ది పూర్తి చేసుకున్న ప్రజాస్వామ్య ప్రగతిశీల రాజకీయ శక్తి సిపిఐ(ఎం).

            దేశంలో చాలా పార్టీలు రకరకాల అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాయి. అనేక విధాల అవకాశవాదాలతో రంగులు మార్చాయి. కాని సిపిఐ(ఎం),వామపక్షాలు ఈ యాభై ఏళ్లలోనూ సామ్యవాద భావజాలానికి లౌకిక ప్రజస్వామ్య విలువలకు అంకితమై వాటిని కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాయి.ఈ దేశంలో ఎర్రజండా ఎగిరిన రోజునుంచి స్వాతంత్రం సామ్యవాద భావజాలం కోసం కమ్యూనిస్టులు అంకితమైనారు. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రధాన భూమిక పోషించినా ప్రజల తరపున నూతన భావాలను ప్రతిపాదించిన వారు కమ్యూనిస్టులే.

            విదేశీ పాలకులు ఇక్కడి వనరులను ముడిపదార్థాలను కొల్లగొట్టి తమ సరుకులు మనపై రుద్దే సమయం. మన రైతులను వ్యవసాయాన్ని నాశనం చేసి తమకు అవసరమైన టీ కాఫీ పొగాకు నీలి మందు తదితర వాణిజ్య పంటలను అలవాటు చేశారు. స్వదేశీ సంస్థానాధీశులు రాజులు, జమీందారులు, దొరలను తాబేదార్లుగా చేసుకుని రైతాంగాన్ని శ్రమ జీవులను క్రూరంగా కొల్లగొట్టారు. అయినా ఈ రాజులు జమీందార్లపై పోరాటం అవసరంలేదన్నది గాంధీజీ భావనగా వుండేది. అలాంటి సమయంలో కమ్యూనిస్టులే భూస్వామ్య రాచరిక వ్యతిరేక పోరాటాలకు నాంది పలికారు. కేరళలో పున్నప్రా వయిలార్‌, బెంగాల్‌లో తెభాగ, త్రిపుర సంస్థానం, తెలుగునాట ఉత్తరాన మందసా నుంచి మునగాల పరగణా, చల్లపల్లి జమీందారు వంటి వారికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు, దీనంతటికి శిఖర స్థాయిలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించారు. ఆ విధంగా శ్రమజీవులనూ అణగారిన తరగతులను కదిలించి గొంతునిచ్చింది విముక్తి సమరాలకు ముందు నిలిచింది కమ్యూనిస్టులే.

            అప్పటి వరకూ మహజర్లకూ అధినివేశ ప్రతిపత్తి వంటి కోర్కెలకు పరిమితమైన కాంగ్రెస్‌ కమ్యూనిస్టుల వచ్చాకే సంపూర్ణ స్వాతంత్రం నినాదమిచ్చింది. అమరజీవి భగత్‌సింగ్‌తో సహా ఎందరో జాతీయ విప్లవ యోధులు కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులైనారు. ఆయన బృందాన్ని ఉరితీసినా మిగిలిన సహచరులంతా కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు. ఈ కారణం చేతనే బ్రిటిష్‌ పాలకులు కమ్యూనిస్టు పార్టీపై ప్రత్యేకంగా కక్ష గట్టారు. దశాబ్దాలుగా వుంటున్న కాంగ్రెస్‌పై ఎన్నడూ ఏ నిషేధం లేదు. కాని అప్పుడప్పుడే మొదలవుతున్న కమ్యూనిస్టుపార్టీనే బ్రిటిష్‌ పాలకులు నిషేదించారు. కేసులమీద కేసులు పెట్టి వేధించారు.కొన్ని వేలమంది కమ్యూనిస్టులను పాలకులు వూచకోత కోశారు. జైళ్లపాలు చేశారు.

కమ్యూనిస్టులు గాంధీజీ లాగే దేశీయ ఆర్థికాభివృద్ధిని కోరుకున్నారు. 1920లలోనే దేశంలో కమ్యూనిస్టులు, మరోవైపున ఆరెస్సెస్‌ ముందుకొచ్చాయి. కమ్యూనిస్టులు ఇన్నిరకాల ప్రజలతో మమేకమవుతుంటే ఆరెస్సెస్‌ కేవలం ముస్లిం వ్యతిరేకతే ప్రధానమన్నట్టు వ్యవహరిస్తూ స్వాతంత్ర పోరాటానికి దూరంగా వుండిపోయింది, బ్రిటిష్‌ వారు కూడా మతతత్వ రాజకీయాలను పెంచి పోషించడంతో చివరకు దేశ విభజన ఘోర మతమారణహోమం చూడవలసి వచ్చింది. స్వాతంత్రం వచ్చి ఆరు నెలలు కాకుండానే ఒక హిందూ మతోన్మాది మహాత్మాగాంధీని క్రూరంగా కాల్చి చంపాడు, కమ్యూనిస్టులు మాత్రం మతసామరస్యం దేశ స్వావలంబన కోసం కట్టుబడ్డారు.

సైద్ధాంతిక స్వచ్ఛత కోసం..

            స్వాతంత్రానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారుటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు. దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక విప్లవ కర సిద్ధాంత స్వచ్చత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డిలతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక భాగాన్ని జైలుపాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జులై7 నుంచి జులై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు.మొత్తంపైన నిర్బంధం మధ్యనే 1964 నవంబరు7న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఏర్పడిరది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సిపిఎం ఎప్పుడు స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశ పరిస్థితులకు తగిన నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించుకుంటూ ముందుకు సాగుతుంది.

సిపిఎం పై దాడి

            సిపిఎం పూర్తిగా ఏర్పడక ముందే ప్రభుత్వం దాడి ప్రారంభించింది. చైనాతో తలెత్తిన సరిహద్దు సంఘర్షణను సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని చెప్పడం పెద్ద అపరాధంగా చిత్రించబడింది. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా అందరూ చైనాతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలనే చెబుతున్నారు. ఆ రోజుల్లో సిపిఎం చెప్పిందీ అదే. దీనికోసమే సిపిఎం నేతలపై చైనా ఏజంట్లని ముద్ర వేశారు.లోక్‌సభలో అప్పటి హోంమంత్రి గుల్జారీ లాల్‌ నందా సిపిఎంపై ఆరోపణలతో ఒక చిట్టా చదివారు. అంతేగాక దేశమంతటా వున్న సిపిఎం నేతలను అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన నాయకులంతా జైళ్లపాలయ్యారు. బ్రిటిష్‌ వారు ఏ విధంగా కాంగ్రెస్‌ను గాక కమ్యూనిస్టుపార్టీని నిషేధించారో అలాగే కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎంపై కక్ష గట్టి ఆదిలోనే దాడి చేసింది. ఇందుకోసం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పిడి)చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే అలా నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో కుక్కినా అప్పుడప్పుడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎంతో ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. సమస్యలపై ఉద్యమాలు సాగించారు. బంజరు భూముల పంపిణీ, డ్రైనేజీల మరమ్మత్తులు వంటి అంశాలపై పోరాడారు. ప్రజాశక్తి పత్రికస్థానంలో ఎన్నో త్యాగాలు చేసి సమిష్టి కృషితో నిర్మించుకున్న విశాలాంధ్ర పత్రిక సిపిఐ చేతికిపోగా సిపిఎం తరపున డి.వి.సుబ్బారావు తదితరులు జనశక్తి పత్రిక స్థాపించారు. అరెస్టయిన నాయకుల విడుదల కోసం ఎందరో మేధావులు పౌర హక్కుల ఉద్యమం నడిపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ మేధావులను కూడా అరెస్టు చేశారు. నాటి పత్రికల్లోహక్కుల కోసం జరిగే పోరాటాలకుఇప్పుడు మీడయాలో వామపక్షలకు వస్తున్న ప్రచారంలో కొంతకూడా లేదు.జైళ్లలోని డిటెన్యూల భార్యలు పిల్లలూ ప్రత్యేకంగా పోరాడిన తర్వాతనే ప్రభుత్వం కనీస హక్కులు సదుపాయాలు కలిగించింది. కనక సిపిఎం పుట్టుకే పోరాటాలతో జరిగింది.

ఉద్యమాలకు తోడ్పాటు :

            సిపిఎం సమరశీల ప్రజా ఉద్యమాలను పునరుద్ధరించేందుకు, కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎంతో దీక్షగా పోరాడింది. శాసనసభలో సిపిఎం నేతలు రాజకీయంగా గట్టి పోరాటం చేసేవారు.శాసనసభలో సుందరయ్య సిపిఎం పక్ష నేతగా వుండగా తరిమెల నాగిరెడ్డి ఉపనేతగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల సమస్యలపై ఆరోజుల్లో అనేక హక్కులు సాధించుకోగలిగారు.1966లో విశాఖ ఉక్కు ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్‌ను వూపేసింది. ఆ సమయంలో సిపిఎం శాసనసభ్యులందరూ రాజీనామా చేసి సంఫీుభావం ప్రకటించారు. అంతేగాక వివిధ సమస్యలపై జిల్లాలలోనూ విస్తారమైన ఉద్యమాలు నడిచాయి.

రూపాయకు కిలోబియ్యం :

            ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం ధరలు మండిపోయాయి.అలాటి తరుణంలో చౌకదుకాణాల ద్వారా రూపాయకు కిలో బియ్యం అందించాలని సిపిఎం ఆందోళన చేసింది. అంతేగాక గన్నవరం ప్రాంతంలో ఆ విధంగా ప్రజలకు తానే అందించింది కూడా. మరికొన్ని చోట్ల పరిమితంగా జరిగింది. ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధమైన కార్యక్రమం అమలు చేయడం అదే ప్రథమం. సహజంగానే ఇది ప్రభుత్వానికి మింగుడుపడలేదు. 1972లోనే పశ్చిమ బెంగాల్‌లో ఇందిరాగాంధీ అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ సాగించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది.ఆ సమయంలో జ్యోతిబాసును రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్య కేంద్రాలలో సభలు జరిపి సంఫీుభావం ప్రకటించింది.

పత్తి రైతుల ఆత్మహత్యలు- అప్పుల భారం :

            ప్రకాశం జిల్లాలో ప్రత్తి రైతులకు ధర పడిపోయి 1984`85లో ఆత్మహత్యలు ప్రారంభమైనప్పుడు సిపిఎం రైతుసంఘం దేశంలోనే మొదటిసారిగా ముందుగా ఆ సమస్యను గుర్తించాయి. గిట్టుబాటు ధర సమస్యను రంగం మీదకు తెచ్చాయి. ప్రత్తికి ధర కావాలని నిర్భందాలని ఎదిరించి పోరాడారు. కొన్ని రాయితీలు సాధించేవరకు ఉద్యమం నడిచింది.

కరువు లో ప్రజలకు అండగా :

            రాజకీయాలు, ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా సిపిఎం ఎప్పుడూ ముందుంటున్నది. 1986లో మహబూబ్‌నగర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం అశ్రద్ధ వలన ప్రజలు సహాయం అందక నానా బాధలు పడుతున్న స్థితి.ఆ సమయంలో సిపిఎం దాతల సహాయంతో నిర్వహించిన గంజి కేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. అనంతపురం లో వరదులు విలయతాండవం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎం కేడర్ ని పూర్తిగా రంగంలోనికి దింపి, శక్తికి మంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించింది.

సారా వ్యతిరేకోద్యమం... సామాజిక తరగతుల పోరాటం :

            1992, 93లోనే జన విజ్ఞాన వేదిక, మహిళా సంఘం ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం వూపందుకుంది. నెల్లూరు జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. సిపిఎం ఈ ఉద్యమానికి అండగా నిలిచింది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే సిపిఎం కులతత్వాలపై కూడా సమరశంఖం పూరించింది. కుల వివక్షతా వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌)ను స్థాపించి సమరశీల ఉద్యమానికి నడుం కట్టింది. సిపిఎం పోరాటఫలితంగాచివరకు నకబడిన కులాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ పున్నయ్య అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. ఇది సామాజిక రంగంలో పెద్ద విజయం.

విద్యుచ్చక్తి ఉద్యమ ఉత్తేజం :

            సిపిఎం మొదటే హెచ్చరించినట్టు విరుచుకుపడుతున్న నూతన విధానాలు దేశానికి శాపంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విజన్‌2020 వంటి వాటితో ఈ విధానాలకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చివేసింది. ఆ పరిస్థితుల్లో అటు సరళీకరణ విధానాలపై పోరాటం ఉదృతం అయ్యింది. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం 2000లో విద్యుచ్చక్తి బోర్డును ముక్కలు చేసి రేట్లు పెంచింది.ఈ పరిస్తితుల్లో సిపిఎం మరో ఎనిమిది వామపక్షాల వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ను కలుపుకుని విద్యుత్‌ ఉద్యమం ప్రారంభించింది. 2000 ఆగష్టు 28న చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద జరిపిన కాల్పులు మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అది మహోద్యమంగా విస్తరించి చంద్రబాబు సర్కార్‌కు ప్రాణ సంకటంగా తయారైంది.

            ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన రాష్ట్రాన్ని ప్రతిఘటనలకూ కేంద్రంగా మార్చడంలో సిపిఎం కృషి ఫలప్రదమైంది. నీటి మీటర్లు, యూజర్‌చార్జీలు, ఔట్‌ సోర్సింగు వంటి అనర్థక పద్ధతుల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించి హెచ్చరించడమే గాక వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. ఆ దశలో జరిగిన అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమం, ఆర్టీసీలో సమ్మెలకు మద్దతూ నిచ్చి వాటివిజయంలో రాజకీయ పాత్ర పోషించింది.

ఉదృతంగా భూపోరాటం :

            పేదలకు కనీస గృహ వసతికల్పించాలకి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన భూపోరాటం ప్రజల మనన్నలు పోందింది. ఈపోరాటంలో అనేక మంది నాయకులు జెళ్లపాలు అయ్యారు . అనేక ప్రాంతాలలో పేదలకు ఇళ్లస్ధలాలు రావడంలో సిపిఎం పోషించిన పాత్ర అమోగం. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఈ పోరాటంపై కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొనడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

            సిపిఎం కెవిపిఎస్‌ తరపున నిరాహారదీక్ష జరిపి ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను సాధించింది. జిల్లాలలో సమగ్రాభివృద్ధి యాత్రలు, సాగునీటి పాదయాత్రలు నిర్వహించింది. భాషారాష్ట్ర విభజనకు వ్యతిరేకంసిపిఎం విధానం అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంది. అవకాశవాదరాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇప్పుడు విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీగా బాషాప్రయుక్త రాష్ట్రలనే కోరుకుంది. రాష్ట్రాలు ఒకటైనా రెండైనా పోరాటం అనివార్యం అనే నినాదంతో అది సమస్యలపై ప్రజలను సమీకరించింది. పోరాటాలు నిర్వహించింది..

ఎన్నికల్లో అవాంచనీయ పోకడలు :

            మొన్నటి ఎన్నికలలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పూర్తి మెజార్టి తెచ్చుకోవడం కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలు కావడం సంభవించాయి. సిపిఎం వామపక్షాల బలం కూడా బాగా తగ్గిపోయింది. తాత్కాలిక ఉద్వేగాలు పాలక వర్గ పార్టీల ప్రచారార్భాటాల మధ్య సిపిఎంకు ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు. విచ్చలవిడిగా డబ్బు, ప్రలోభాలు మాత్రమే గాక కార్పొరేట్‌ శక్తులు పెద్ద పెద్ద కాంట్రాక్లర్లతోపాటు, కంపెనీల యజమానులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్ధులయ్యారు.కనీవినీ ఎరుగని స్థాయిలో పార్టీ ఫిరాయింపుల నడుమ జరిగిన ఎన్నికల్లో ప్రజా సమస్యలకు తావులేకుండా పోయింది. కులం అస్త్రాన్ని బాగా ప్రయోగించారు మరోవంక 1998లో వలెనే తెలుగుదేశం అధినేత బిజెపితో జతకట్టడమే గాక ప్రభుత్వాలలో పరస్పర భాగస్వామ్యం తీసుకున్నారు.. గతంలో తను రెండు సార్లు ఓడిపోవడానికి కారణమైన విధానాలు సవరించుకోకపోగా చంద్రబాబు కార్పొరేట్‌ ఎజెండాను మరింత తీవ్రంగా అమలు చేస్తున్నారు. రుణమాపీ వంటి వాగ్డానాలు నీరుగార్చి కొత్త కొత్త భారాలు వేసేందుకు ప్రజా వనరులు కార్పొరేట్‌ పరం చేసేందుకు సంసిద్ధులవుతున్నారు.

            వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, లౌకిక పక్షాల సమీకరణకు తోడు ఆర్థిక రంగంలో ప్రమాదాలను తిప్పికొట్టకపోతే ముందు ముందు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మరింత దుర్భరం కావడం తథ్యం అనేది సిపిఎం అంచన.సామాజికంగా అణచివేతకు వెనకబాటుకు గురైన తరగతులకు సామాజిక రక్షణ కవచం సాధించవలసి వుంది. దేశీయ వ్యాపారాలను దెబ్బతీసేలా ఎఫ్‌డిఐల ప్రవేశం పెను ముప్పు తీసుకొస్తుంది. యాభై ఏళ్లలో ప్రజా ఉద్యమాలను సైద్ధాంతిక విశిష్టతను స్మరించుకుంటునేసిపిఎం నేటి పరిస్థితులకు తగినట్టు తనను తాను సమాయత్తం చేసుకుంటుంది. జాతీయోద్యమంలో నాడు కాంగ్రెస్‌ అధినివేశ ప్రతిపత్తికి పరిమితమైతే కమ్యూనిస్టులు తొలుత సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం ఇచ్చారు. నాడు బ్రిటీష్‌ పాలకులు కమ్యూనిస్టుల్ని దేశవ్యాపితంగా అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. అయిన పోరాటం ఆగలేదు. సాగుతూనే ఉంది.

ఈనాడూ కమ్యూనిస్టులు వామపక్షాలే మళ్ళీ సరళీకరణ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటంలో చేస్తున్నాయి. కార్మిక రైతు సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు మహిళలు సామాజిక తరగతులు అన్నిటిలో మరింత చొరవగా ముందుకు సాగడానికి సంసిద్ధమవుతుంది.పోరాటాలకు పదును పెంచడం ప్రధాన కర్తవ్యంగా మీ అందరి తోడ్పాటుతో భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వసిస్తుంది. ఈ పరీక్షా సమయంలో సవాళ్లను అధిగమించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకుప్రతివారి సహాయ సహకారాలు సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీగా కోరుతున్నాము.