ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్, జపాన్ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్లాగా, జపాన్, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం.