అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

 ప్రపంచ ఆర్థిక సంకోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్‌ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ 1-4-2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు బేసెల్‌ 3 ప్రమాణాలను అమలుచేయాలని అదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో బ్యాం కుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ, అంతిమంగా ప్రైవేటీ కరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్రమోడీ నాయకత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.
బేసెల్‌ ప్రమాణాల నేపథ్యం :
నయా ఉదారవాద విధానాలు అమలౌ తున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్‌ ధోరణులు మితిమీరడంతో ఆర్థిక వ్యవస్థలలో ఒడుదుడుకులు సర్వసాధారణ మయ్యాయి. వీటి నీలినీడలు బ్యాకింగ్‌ రంగంపై పడి బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకమయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కో వడం కోసం '' అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు'' (బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌) పర్యవేక్షణలో, స్విడ్జర్లాండ్‌ నందలి బేసెల్‌ నగరంలో బ్యాంకింగ్‌ పర్యవేక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీయే తదనంతర కాలంలో బేసెల్‌ కమిటీగా ప్రాచుర్యం పొందింది. బ్యాంకుల పరిరక్షణకు బేసెల్‌ కమిటీ నిర్దేశించిన విధానాలు బేసెల్‌ నారమ్స్‌ లేదా బేసెల్‌ ప్రమాణాలుగా పిలువబడుతున్నాయి. బేసెల్‌-1 ప్రమాణాలు :
1988 జులైలో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది. బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమా ణాలు బేసెల్‌-1 ప్రమాణాలుగా ప్రసిద్ధి కెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన సమస్యలతో (రిస్క్‌) కూడిన రుణాల మొత్తంలో 8 శాతంతో సమాన మైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) అని అంటారు. దీన్ని లెక్కించడం కోసం వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న సమస్యలను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. రుణాల నాణ్యతను బట్టి, రుణ మొత్తంలో పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి'' ని బ్యాంకులు అమలు చేయాల్సి ఉంటుంది.
బేసెల్‌-1 ప్రభావాలు :
బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయ వంతమైనాయి. బేసెల్‌ - 1 ప్రమాణాలు ప్రథానంగా రుణాలలో ఇమిడి ఉన్న సమస్యల పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని సమస్యల విశ్లేషణ వర్గీకరణతో, ఇంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక సమస్యాత్మకమైనవిగా భావించబడ్డాయి. దీనితో వాటికి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న వివిధ దేశాలలో ప్రాథాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్థక ఆస్థులు (నాన్‌పెర్‌ ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌) గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్థక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడి, మూలధన కొరతను ఎదుర్కొన్నాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్యరంగంలో వచ్చిన మౌలిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది.
ప్రపంచీకరణ స్వరూప స్వభావాలలో నెలకొన్న మార్పులతో ద్రవ్య మార్కెట్‌లో వినూత్న ద్రవ్య ఉత్పత్తులు (ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్స్‌) రంగం మీదకొచ్చాయి. ఈ ద్రవ్య ఉత్పత్తుల్లో స్పెక్యులేషన్‌ తీవ్రత భారీగా ఉంది. రుణ రంగ ప్రాధాన్యత పెరిగి, రుణ డెరివేటివ్‌ల్లాంటి అత్యధిక సమస్యలతో కూడిన ద్రవ్య ఉత్పత్తుల ప్రవేశంతో మార్కెట్‌ సమస్యలు అపరిమితంగా పెరిగాయి. దీన్ని తట్టుకోగలిగే సమస్యాపరిష్కార యాజమాన్య పద్ధతులు బేసెల్‌-1 ప్రమాణాలలో లేకపోవడం బ్యాంకులకు పెను సవాలుగా మారింది. బేసెల్‌-1 ప్రమాణాలు అంచనా కట్టిన రుణ సమస్యల పరిధికి మించిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు వారి వారి బ్యాలెన్స్‌ షీట్లను తిమ్మినిబమ్మిని చేశాయి. నూతన ద్రవ్య ఉత్పత్తుల మూలంగా నెలకొన్న అదనపు సమస్యలకు అనుగుణంగా అదనపు మూలధన సమీకరణకు ప్రమాణాలు లేకుండా పోయాయి. అధిక నాణ్యత కలిగిన రుణాలపై బ్యాంకు ఆర్జించే లాభాల కంటే నాసిరకం రుణాలు/పెట్టుబడులు అత్యధిక లాభాల్ని ఆర్జించడంతో, అంతర్జాతీయ బ్యాంకులు నాణ్యత కలిగిన రుణాల మంజూరును నిర్లక్ష్యం చేయడం మొదలైంది. బ్యాంకులు అంతర్గతంగా అనుసరి స్తున్న పద్ధతుల్లో పారదర్శకత లోపించింది. 1990లలో బేసెల్‌-1 ప్రమాణాలను తు.చ. తప్పకుండా అమలు చేసిన థారులాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాలలోని ద్రవ్య వ్యవస్థలు ద్రవ్య సంక్షోభంతో తల్లక్రిందులైనాయి. అనేక బ్యాంకులు మూతబడ్డాయి. ఈ సవాళ్ళను అధిగమించడా నికి బేసెల్‌ కమిటీ 2014 జూన్‌లో బేసెల్‌-2 ప్రమాణాల పేర నూతన మారద్గర్శకాల్ని రూపొందించింది. ఈ ప్రమాణాలు బేసెల్‌-1 ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నాయి. కనీస మూలధన పరిమాణం, పర్యవేక్షణ సమీక్ష, మార్కెట్‌ క్రమశిక్షణ అనే మూడు స్తంభాలపై (పిల్లర్స్‌) బేసెల్‌-2 ప్రమాణాలు నిర్మింపబడ్డాయి. బ్యాంకులు ఎదుర్కొనే సమస్యలను బేసెల్‌-2 ప్రమాణాలు రుణాల సమస్య, మార్కెట్‌ సమస్య, నిర్వహణ సమస్యలుగా వర్గీకరించాయి.
బేసెల్‌-2 ప్రభావాలు :
1. బ్యాంకులు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు నిర్ణయింపబడ్డాయి. 
2. బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పనకు అత్యధిక స్థాయిలో గణాంక వివరాలు కావల్సివచ్చింది. వివిధ స్థాయిలలో సమస్యలను గణించటానికి ఉన్నతస్థాయి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ అవసరమైంది. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. 
3. ఇంత భారీస్థాయి పెట్టుబడులు, సేకరిం చాల్సిన అదనపు మూలధనం పెద్ద బ్యాంకులకే సాధ్యమవటం వల్ల, చిన్న బ్యాంకులు ఈ రంగంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల విలీనాలు, ఏకీకరణలకు బేసెల్‌-2 ప్రమాణాలు సారధులుగా పనిచేశాయి.
4. అత్యధిక మూలధన అవసరాలకోసం బ్యాంకులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 
5. ద్రవ్య సంక్షోభ సమయాలలో కార్పొరేట్ల రుణ రేటింగ్‌ పడిపోయింది. దీని కారణంగా బేసెల్‌-2 ప్రమాణాల ప్రభావంతో అవసరమైన కాలంలో రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో ఆర్ధిక వికాస (బూమ్‌) కాలంలో కార్పొరేట్ల రుణ రేటింగ్‌లు మెరుగై, బ్యాంకులకు అధిక నిధుల లభ్యతతో రుణాల మంజూరు వేగవంతమయ్యాయి. బ్యాంకుల సుస్థిరతకు పకడ్బందీగా బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పన జరిగిందనుకొన్న ప్పటికీ, ఇవి రుణ సంక్షోభాలకు దారి తీశాయి. 2007/2008లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, బ్యాంకుల దివాళాలను అవి ఆపలేకపోయాయి.
బేసెల్‌ ప్రమాణాలు - భారతదేశం :
సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారతదేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' ని 8 శాతంగా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9 శాతంగా ఖరారు చేసింది. బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్థక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్థక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్థక ఆస్తుల శాతం తగ్గింది. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ, డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాథాన్యతా రంగానికి రుణాలను ఇవ్వటానికి వాణిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.
ఫిబ్రవరి 2005లో రిజర్వుబ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వీటి ప్రకారం భారత వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలుకు ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్యదేశం. ఈ నేపథ్యంలో భారతదేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది. బేసెల్‌ -2 ప్రమాణాల అమలుకు కావలసిన నిధుల పరిమాణం మరింతగా పెరిగింది. జాతీయ బ్యాంకులు వారి లాభాలను అంతకు ముందు నిరర్థక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండ్ల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51 శాతానికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు, ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33 శాతానికి తగ్గించాలని ఒత్తిడి పెరిగింది. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సంఘాల వ్యతిరేకత, 2007/2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి అడ్డుకట్ట పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయిం చాయి. ఈ సమయంలో 2004 మార్చిలో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోనివే. ఈ రకంగా భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించ టానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8 శాతంగా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9 శాతంగా నిర్ణయించింది. కానీ భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12 శాతం ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం అనూహ్యంగా పెరిగింది. బ్యాంకుల అదనపు మూలధన సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని పొందింది.
బేసెల్‌-3 ప్రమాణాలు :
అత్యధిక లాభాల వేటలో నిజ ఆర్థిక వ్యవస్థను లక్ష్య పెట్టకుండా ద్రవ్య పెట్టుబడి చేపట్టిన వికృత చేష్టలు 2007/2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణభూతం కాగా, వాటిని అరికట్టే చర్యలేమీ చేపట్టకుండా, ఇటువంటి సంక్షోభాల నుండి బ్యాంకులను, ద్రవ్య వ్యవస్థలను పరిరక్షించే కర్తవ్యాన్ని బేసెల్‌-3 ప్రమాణాలు నెత్తికెత్తుకున్నాయి. అమితమైన నిధుల లభ్యత (లిక్విడిటి), అత్యధికమైన అప్పులు/మూలధన నిష్పత్తి (లివరేజ్‌ రేషియో), అతి తక్కువ మూలధనం, చాలీచాలని నిధుల లభ్యత 2008 ద్రవ్య సంక్షోభానికి ప్రధాన కారణాలుగా బేసెల్‌ కమిటీ భావించింది. వీటితో పాటు రిస్క్‌ యాజమాన్యం, కార్పొరేట్‌ పాలన, మార్కెట్‌ పారదర్శకత మరియు పర్యవేక్షణ నాణ్యతలు లోపభూయిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''మొత్తం ద్రవ్యవ్యవస్థ సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో మెరుగైన నాణ్యతను, గణనీయమైన పరిమాణాన్ని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమయ్యాయి.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడం, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం పరిణామం చెందే దశలో ఉండటం ప్రధాన కారణాలుగా భారత రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు అంగీకరించింది. మొదట్లో ఈ ప్రమాణాలను భారత దేశంలో జనవరి - 1, 2013 నుండి అమలు చేయాలనుకున్నప్పటికి, ఏప్రియల్‌ 1, 2013 నుండి మొదలైన ఈ ప్రక్రియ 31 మార్చి 2019 నాటికి అన్ని విధాలుగా పూర్తి కావాలని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించింది.
బేసెల్‌-3 ప్రమాణాల ఖరీదెంత?
ఈ ప్రమాణాల అమలుకు భారతీయ బ్యాంకులు, ప్రత్యేకించి జాతీయ బ్యాంకులు భారీ స్థాయిలో నిధుల్ని సేకరించాల్సి ఉంది. ఈ నిధుల్ని మొదటి అంచె (టైర్‌ 1) మూలధనం, రెండవ అంచె మూలధనంగా వర్గీకరించారు. మొదటి అంచె మూలధనం కింద బ్యాంకు వాటాదారుల నుండి సేకరించే అదనపు మూలధనం, బ్యాంకుల అంతర్గత నిధులైన మూలధనం, లాభాలు, బ్యాంకు వాటాలు అమ్మటం ద్వారా ఒనకూడే మూలధనం మరియు మొదటి అంచె హైబ్రిడ్‌ బాండ్ల అమ్మకం ద్వారా సేకరించిన నిధులు ఉన్నాయి. రెండవ అంచె మూలధనం కింద రెండవ అంచె బాండ్ల విక్రయం ద్వారా పొంద కలిగే నిధులు ఉన్నాయి. ఈ ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 31.3.2014 నాటికి 9 శాతంతో మొదలై, 31.3.2018 నాటికీ 11.5 శాతానికి చేరుకోవాలి. వివిధ రేటింగ్‌ సంస్థల అంచనాలలో, భారత జాతీయ బ్యాంకుల్లో వచ్చే 4 సంవత్సరాల్లో అదనంగా కనీసం 4,60,120 కోట్ల రూపాయలు పెట్టుబడి సమీకరించవలసి ఉంది. ఇందులో మొదటి అంచె మూలధనం ఈక్విటీ రూపంలో 2,39,720 కోట్ల రూపాయలు, మొదటి అంచె మూలధన హైబ్రిడ్‌ బాండ్ల రూపంలో 1,55,900 కోట్ల రూపాయలు, రెండవ అంచె పెట్టుబడి బాండ్లరూపంలో 64,500ల కోట్ల రూపాయలు సమీకరించాలి. మొదటి అంచె, రెండవ అంచె పెట్టుబడి బాండ్లను సంస్థలు, వ్యక్తుల నుండి సమీకరించవచ్చును. కాని మొదటి అంచె మూలధనాన్ని జాతీయ బ్యాంకుల ఈక్విటీ వాటాల విక్రయం ద్వారా కాని, బ్యాంకుల అంతర్గత వనరులైన లాభాలు, రిజర్వ్‌ నిధుల ద్వారా కాని సమీకరించాలి.
నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వ 
సహాయ నిరాకరణ
ఇంతటి భారీ నిధులు స్వంతంగా సమీకరించకలిగే శక్తి జాతీయ బ్యాంకులకు లేని కారణంగా, జాతీయ బ్యాంకుల అత్యధిక వాటాల హక్కుదారుడైన కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను అందించవలసి ఉన్నది. గతంలో బేసెల్‌-1, బేసెల్‌-2, ప్రమాణాలు అమలు సందర్భంగా అవసరమైన మూలధనంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా సమకూర్చింది. 2000-01 నుండి 2014-15 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 80,200 కోట్ల రూపాయల పెట్టుబడిని జాతీయ బ్యాంకులకు సమకూర్చింది. ఇందులో 58,600 కోట్ల రూపాయలు 2010-11 నుండి 2013-14 మధ్య కాలంలో సమకూర్చినవే. కాని మోడీ నాయకత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం 2014-15 సంవత్సరంలో జాతీయ బ్యాంకుల మూలధన సమీకరణకు బడ్జెట్‌లో 11,200 కోట్ల రూపాయలు కేటాయించగా, వాస్తవంలో 6,900 కోట్ల రూపాయలు మాత్రమే అందిం చింది. కుదించిన ఈ మొత్తం కేవలం 9 జాతీయ బ్యాంకులకు వాటి పనితీరును బట్టి ప్రభుత్వం నిర్దిష్టంగా కేటాయించింది. మిగిలిన బ్యాంకులకు నిధుల కేటాయింపు శేష ప్రశ్నగానే మిగిలివుంది. దీనికి కొనసాగింపుగా 2015- 16 సంవత్సరానికి బడ్జెట్‌ కేటాయిం పును 7940 కోట్ల రూపాయలకు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఒంటెత్తు పోకడలు జాతీయ బ్యాంకులకు మూలధనం అందించ డానికి దాని వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి.
ముందస్తు వ్యూహంలో యన్‌డిఎ ప్రభుత్వం :
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన సమీకరణ విషయంలో జాతీయ బ్యాంకులకిస్తున్న సందేశం సుస్పష్టంగానే ఉన్నది. ద్రవ్య సుస్థిరత (ఫిస్కల్‌ కన్సాలిడేషన్‌) మిషతో, జాతీయ బ్యాంకులకు మూలధనం కోసం జరిపే బడ్జెట్‌ కేటాయింపులు ద్రవ్య లోటును భారీగా పెంచుతుందని, భారత ఆర్ధిక వ్యవస్థ లోటును భరించే స్థితిలో లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. పారిశ్రామిక ప్రగతి పేరుతో లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు కట్టబెట్టినప్పుడు స్ఫురణకు రాని ద్రవ్యలోటు, ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఆపార సేవలందించిన జాతీయ బ్యాంకుల మనుగడను నిలబెట్టేందుకు అందించాల్సిన నిధుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని చెప్పటం కేంద్ర ప్రభుత్వ వర్గ దృక్పధాన్ని తేటతెల్లం చేస్తున్నది. జాతీయ బ్యాంకులు మూలధన సమీకరణకు అవసరమైన నిధుల్ని వాటంతట అవే వివిధ సృజనాత్మక పద్ధతులలో సమీకరించుకోవాలని, బ్యాంకుల మూలధన సమీకరణ కేంద్ర బడ్జెట్‌కు మరింత భారం కాకూడదన్న వాదనను మనం కూడా అంగీకరిస్తే, సృజనాత్మక ద్రవ్య సుస్థిరత చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల మూలధన సమీకరణ బాధ్యత నుండి తప్పించుకుంటుంది. జాతీయ బ్యాంకులకు ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారానే నిధులను సమీకరించుకోవటం అనివార్యమౌతుంది. 52 శాతానికి తగ్గకుండా జాతీయ బ్యాంకులు ప్రభుత్వ వాటాను తగ్గించుకోవచ్చునని 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఆర్ధికశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను ఈ పరిణామాలలో భాగంగా చూడాల్సివుంది. 
దొడ్డి దారిన జాతీయ బ్యాంకుల 
ప్రయివేటీకరణకు కుట్ర :
రిజర్వ్‌ బ్యాంక్‌ బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ అంచనాలు ఇలా ఉన్నాయి. వచ్చే నాలుగేళ్ళలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 52 శాతంకు తగ్గకుండా, ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా 1,60,825 కోట్ల రూపాయలు మొదటి అంచె, రెండవ అంచె మార్కెట్‌లో బాండ్ల విక్రయం ద్వారా 2,20,400 కోట్ల రూపాయలు, బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా 78,895 కోట్ల రూపాయల మూలధనాన్ని సమీకరించాలి. ఈ కాలంలో జాతీయ బ్యాంకుల నుండి డివిడెండ్ల రూపంలో 34,500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నికరంగా భరించాల్సిన భారం రూ.44,395 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి 11000 కోట్ల రూపాయలు సరిపోతాయి. ఈ అంచనాలు చూడటానికి, వినడానికి సాధ్యమైనవిగా తోచినా, అచరణలో అవి అంత సులువుగా సుసాధ్యాలు కావని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ ఈక్విటీ 43 శాతం బ్యాంకులలో 51-61 శాతంగా, 24శాతం బ్యాంకులలో 62-71 శాతంగా, 19 శాతం బ్యాంకులలో 72-81 శాతంగా, 14 శాతం బ్యాంకులలో 82 శాతంగా ఉన్నది. సెన్సెక్స్‌ గరిష్టంగా 29,000 పాయింట్ల స్థాయికి పెరిగిందనుకొని, ప్రస్తుత జాతీయ బ్యాంకుల వాటాలు బుక్‌ చేసే ధరకు, జాతీయ బ్యాంకులలోని 52 శాతానికి పైబడ్డ వాటాలన్నింటిని విక్రయించినా, 1,00,000 కోట్ల రూపాయలకు మించి మూలధన సమీకరణ సాధ్యం కాదని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానం వలన జాతీయ బ్యాంకుల మూలధన సమీకరణలో ప్రభుత్వ ఈక్విటీని పెద్ద మొత్తంలో తగ్గించవలసి ఉంటుంది. దీని పర్యవసా నంగా జాతీయ బ్యాంకులలో కేంద్ర ప్రభుత్వం తమ యాజమాన్యాన్నే వదలుకోవలసి వస్తుంది. ఈ అంచనాను రూఢ చేస్తున్నట్లు, రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ కలకత్తాలో పత్రికా సమావేశంలో మాట్లా డుతూ జాతీయ బ్యాంకుల్లో 52 శాతానికి మించిన ప్రభుత్వ వాటాల విక్రయంతోనే బేసెల్‌-3 ప్రమాణాల అవసరాలు తీరవన్నారు.
బ్యాంకులకు వినాశకారిగా మారిన ప్రగతి :
మూలధన అవసరాలను అంచనా వేసేటప్పుడు, ఈ గణాంకాలు ఎలా వచ్చాయో కూడా అవగాహన చేసికొనవలసివుంది. జాతీయ బ్యాంకుల ఆర్థిక స్థాయిని బట్టి, భవిష్యత్తులో నిర్వహించబోయే వ్యాపారాన్ని బట్టి మూలధన పరిమాణం నిర్ణయించబడు తుంది. శీఘ్రంగా డిపాజిట్లు వసూలుచేసి, రుణాలు మంజూరు చేసినట్లయితే వాటిలో సమస్యలతో కూడిన ఆస్థులు పెరుగుతాయి. బేసెల్‌-3 ప్రమాణాల ప్రకారం సమస్యలతో కూడిన ఆస్థులు పెరిగితే, ఆస్థుల పరిమాణం పెరుగుతుంది. అందువలన సమస్యల మోతా దును బట్టి అవసరమైన మూలధన పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు ఒక రంగంలో 1000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కనీసం 90 కోట్ల రూపాయల మూలధనం సమకూర్చుకుంటే కాని రుణాల మంజూరుకు రిజర్వ్‌ బ్యాంకు అనుమతినివ్వదు. బేసెల్‌-3 ప్రమాణాలు ఐచ్ఛికమైనా, భారతదేశంలో ఒక బ్యాంకు ఈ ప్రమాణాల ప్రకారం మూలధన నిధుల్ని ఏర్పరచుకోకపోతే, ఆ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణను రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతించదు. మూడీ స్‌ రేటింగు సంస్థ వాదనల ప్రకారం, భారతదేశంలో బ్యాంకుల వ్యాపారాభివృద్ధి ఒక మోస్తరుగా ఉండి, బ్యాంకుల నిరర్థక ఆస్థులు తగ్గుముఖంలో ఉంటే, బ్యాంకు ఋణ వితరణలో 62 శాతంగా ఉన్న 11 జాతీయ బ్యాంకులు 2015 నుండి 2019 ఆర్ధిక సంవత్సరం వరకు కనీసం 1,50,000 కోట్ల రూపాయల నుండి 2,40,000 కోట్ల రూపాయల మూలధనం సమీకరించాల్సి ఉంటుంది. మూడీస్‌ రేటింగ్‌ సంస్థకు భారతదేశ అసోసియేట్‌ సంస్థ అయిన ''ఇక్రా'' 2010లో వేసిన అంచనా ప్రకారం 2019లోగా భారత దేశంలో జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకులు కలిసి 6 లక్షల కోట్ల రూపాయలు మూలధనం క్రింద సేకరించుకోవాల్సి ఉంటుంది. ఇంతటి భారీ నిధుల సమీకరణతో జాతీయ బ్యాంకులు బతికి బట్టకట్టేనా? పెట్టుబడులపై అధిక ఆదాయం (రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) రావాలంటే అధికంగా వ్యాపారం చేయాలి. అధికంగా వ్యాపారం చేయాలంటే అధికంగా అదనపు మూలధనం సమీకరించాలి. ఈ మూలధనంలో మొదటి అంచె మూలధనం మార్కెట్లో బాండ్ల రూపంలో సమీకరిస్తే 5 సంవత్సరాలపాటు వడ్డీ, తర్వాత ఆ బాండు దారునికి ఈక్విటీ వాటాలు విక్రయించాలి. అంటే అధిక వ్యాపారం చేసి క్రమంగా ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచడమే అవుతుంది. రెండవ అంచె బాండ్ల విక్రయం మొదటి అంచె బాండ్ల విక్రయాన్ని మించి ఉండకూడదు. రెండవ అంచె బాండ్ల విక్రయంతో మూలధనాన్ని సమీకరించాలంటే దాదాపు 11.5 శాతం వడ్డీ చెల్లించాలి. ఇది ఖర్చును పెంచి లాభాలను కుదిస్తుంది. ఇది ఈక్విటీపై ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వాటాల మార్కెట్‌ విలువ తగ్గుతుంది. 1వ అంచె మూలధన సమీకరణకు అధిక పరిమాణంలో బ్యాంకు వాటాలను అమ్మాల్సివస్తుంది. ఈ ప్రక్రియ కూడా జాతీయ బ్యాంకులలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచేదే. ప్రభుత్వం జాతీయ బ్యాంకులకు మూలధన వనరులను అందించకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకమౌతుందని పై అంశాలు స్పష్టం చేస్తున్నాయి.
అంత్య క్రియలకు రంగం సిద్ధం :
బేసెల్‌ ప్రమాణాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, అవి ఆచరణలో అన్ని విధాలుగా జాతీయ బ్యాంకుల మనుగడకు విఘాతం కల్పించేవిగా ఉన్నాయి. దీనికి తోడు జాతీయ బ్యాంకుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం 2014 జనవరి 20న పి.జె.నాయక్‌ సారధ్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ 2014 మే 12న తన నివేదికను అందించింది. జాతీయ బ్యాంకుల పనితీరు లోపభూయిష్టంగా ఉందని, ఇవి ప్రభుత్వానికి గుదిబండలుగా ఉన్న కారణంగా జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను 50 శాతం కంటే తక్కువకు కుదించి, వాటి పనితీరులో తీవ్ర మార్పుల్ని చేపట్టాలని సిఫార్సు చేసింది. బేసెల్‌-3 ప్రమాణాల అమలుతో ఉత్పన్నమయ్యే పరిణామాలను వినియోగించుకొని జాతీయ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయటానికి బాటలు వేయటమే ఈ సిఫార్సుల లక్ష్యంగా ఉంది. ఈ సిఫార్సులను సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తున్నది. 2015 జనవరి 2, 3 తేదీలలో జ్ఞాన్‌ సంగం పేర పూనాలో జాతీయ బ్యాంకుల అధినేతలతో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే మార్గదర్శ కాలను (రోడ్‌ మ్యాప్‌) గురించి చర్చించినట్లు తెలుస్తున్నది. 
ప్రత్యామ్నాయం ఏమిటి :
అదనపు మూలధన అవసర ప్రమాణాలు చాలా వింతగా ఉన్నాయి. బేసేల్‌-3 ప్రమాణాల రూపకల్పన ముందు అంతర్జాతీయ ప్రమాణాల కంటే భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో సముచిత మూలధన నిష్పత్తి చాలా ఆరోగ్యకరంగా ఉంది. బేసెల్‌-2 ప్రమాణాల ప్రకారం సాధారణ 1వ అంచె మూలధన నిష్పత్తి 2 శాతం ఉండాల్సి ఉండగా, భారతదేశ ప్రమాణం 3.6 శాతంగా ఉంది. బేసెల్‌-2 ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 8 శాతం కాగా, భారతదేశ ప్రమాణాలలో ఇది 9 శాతంగా ఉంది.
ప్రాథమికంగా ఇటువంటి అనుకూల పరిస్థితులున్నప్పటికీ, మూలధన అంచనాలు ఈ క్రింది కారణాల రీత్యా భారీగా ఉన్నాయని నిపుణులు భావిస్తూ, జాతీయ బ్యాంకుల పరిరక్షణకు కింది సూచనలు చేస్తున్నారు.
1) బ్యాంకింగ్‌ వ్యాపారంలో భారతదేశం భారీగా విస్తరింప బడుతుందని అంచనా వేయబడింది. 1990లలో స్థూల దేశీయోత్పత్తిలో షెడ్యూల్డ్‌ బ్యాంకుల రుణాలు 20-22 శాతం ఉండగా, 2003-04 నాటికి 55 శాతానికి చేరాయి. ఈ ఆనుభవంతో రుణాల విస్తరణ యధాతధంగా కొనసాగుతుందని అంచనా వేశారు. కాని 2000 సం||లలో విదేశీ నిధులు భారీగా భారతదేశంలో ప్రవేశించి, తేలికగా నిధులు అందుబాటులోకి రావటంతో భారీగా ఋణాల విస్తరణ జరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో చొరబడిన సరళీకరణ విధానాల మూలంగా విస్తారమైన రుణ గ్రహీతలతో పాటు అప్పులు చెల్లించని వారి సంఖ్యను కూడా పెరిగింది. ఫలితంగా స్థూల నిరర్థక ఆస్తులు పెరిగాయి. అందువల్ల భారతదేశంలో అపరిమితంగా పెరిగిన బ్యాంకింగ్‌ వ్యాపార విస్తరణ ఆరోగ్య ఫలితాల్ని ఇవ్వనందున, అటువంటి వ్యాపారంపై ఆధారపడ్డ భవిష్యత్తు అంచనాలు సమంజసం కాదు. ఈ అంచనాల్ని తిరిగి సమీక్షించాలి.
2) ఈ మధ్య సంవత్సరాలలో గణనీయంగా పెరిగి, 2014 డిసెంబర్‌ నాటికి 5.6 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేయబడింది. దీని పర్యవసానంగా కూడా అదనపు మూలధన పరిమాణ అంచనాను పెంచారు. మొండి బాకీలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీల చిట్టాను బహిర్గతం చేసి, కఠిన చర్యలతో, చట్టాలతో బాకీల వసూళ్ళకు పూనుకోవడంలో పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. డిసెంబర్‌ 2014 నాటికి జాతీయ బ్యాంకులలో నిరర్థక ఆస్తుల కింద 2,73,000 కోట్ల రూపాయలు, పునర్నిర్మాణం చేయబడ్డ కార్పొరేట్‌ బకాయిలు 2,72,000 కోట్ల రూపాయలు పేరుకుపోయి జాతీయ బ్యాంకులకు గుదిబండలుగా మారాయి. నిరర్థక ఆస్థులలో బకాయి పడ్డ మొదటి 30 సంస్థల బకాయిలు మొత్తం నిరర్థక ఆస్థులలో 37 శాతంగా ఉన్నాయి. పునర్నిర్మాణం చేయబడ్డ కార్పొరేట్ల బకాయిలలో 64 శాతం మౌలిక రంగాలకు సంబంధించిన సంస్థలవే. నయా ఉదారవాద విధానాలలో భాగంగా మౌలిక రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలనే ఉబలాటంలో ప్రభుత్వాలు జాతీయ బ్యాంకులను ఒత్తిడి చేసి ప్రైవేటు సంస్థలకు, పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్య సంస్థలకు ఇప్పించిన అప్పులు ఇవి. వీటి రికవరీ బాధ్యతా ప్రభుత్వానిదే.
3) బేసెల్‌-3 ప్రమాణాలు ప్రపంచ ద్రవ్య సంక్షోభానికి కారణమైన బ్యాంకుల సమస్యలనుద్దేశించి రూపకల్పన చేయబడినవి. భారత దేశంలో జాతీయ బ్యాంకులు ద్రవ్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కాకుండా విస్తృతమైన సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. అందువల్ల బేసెల్‌-3 ప్రమాణా లను యథాతథంగా అమలు చేసి, జాతీయ బ్యాంకులను బలిచేయటం సమంజసం కాదు.
4) బేసెల్‌-3 ప్రమాణాల అమలులో అత్యుత్సాహం జాతి ప్రయోజనాలకే నష్టదాయకం. బేసెల్‌-3 ప్రమాణాల అమలు తుది గడువు మార్చలేని శిలాశాసనం కాదు. ఇప్పటికే 31.3.2018 నుండి 31.3.2019కి మార్చారు. ఈ తుది గడువును మరో 4 సంవత్స రాలు పెంచి, జాతీయ బ్యాంకుల అదనపు మూలధన అవసరాలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు ద్వారానే తీర్చాలి.
5) ప్రపంచ దేశాలలో బ్యాంకులు, నియంత్రణ సంస్థలు బేసెల్‌-3 ప్రమాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తిగా అమలు చేస్తారా లేదా అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. బేసెల్‌ ప్రమాణాల అమలు వర్థమాన దేశాల మనుగడకు నష్టదాయకమనే భావన సర్వత్రా వ్యాపించివుంది.
6) జాతీయ బ్యాంకుల మనుగడకు ముప్పు కలిగించే నాయక్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయరాదు. జాతీయ బ్యాంకులలో చిన్నా పెద్దా తేడా లేకుండా, ప్రభుత్వం అన్నింటికి అవసరమైన అదనపు మూలధనం అందించిన తరువాతే వాటి పనితీరును సమీక్షించాలి. వాటి పనితీరు మెరుగు పరిచేందుకు ఉద్యోగులు, అధికారుల సంఘాలతో చర్చించాలి.
7) అవసరమైతే జాతీయ బ్యాంకుల పరి రక్షణకు దేశావ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాలి.
- కొండముది లక్ష్మీప్రసాద్‌