2016

పనులు లేకున్నా మద్యం తాగబోస్తున్నారు..

పనులు లేకుండా ఇళ్లల్లోని మగాళ్లతో మద్యాన్ని తాగబోస్తున్నారని అన్నవరప్పాడు మహిళలు వాపోయారు. పిల్లలను పోషించేందుకు అంతులేని అగచాట్లు పడుతున్నామని, కాస్తో కూస్తో కూలి డబ్బులున్నా వాటిని మార్చుకోడానికి బ్యాంకుల వద్ద పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావని ఆవేదనను వెళ్లగక్కారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. అన్నవరప్పాడులోని మహిళలు సిపిఎం బృందానికి తమగోడు వెళ్లబోసుకున్నారు.

పంపిణీ చేయకుంటే జెండాలు పాతుతాం

పేదల కోసమని పెదరావూరులో సేకరించిన భూమిని అర్హులకు పంపిణీ చేయకుంటే ఆ భూమిలో సిపిఎం జెండాలు పాతి పంచుతుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి చెప్పారు. 11 రోజులుగా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వైకుంఠపురం కాల్వకట్ట, నరేంద్రదేవ్‌కాలనీ, హడ్కోకాలనీ, చినరావూరు తోట, చినరావూరు డొంక తదితర ప్రాంతాల్లో సాగింది. 50 ఏళ్ల నుండి వైకుంఠపురం కాల్వకట్ట, చినరావూరు డొంక రోడ్డులలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, పట్టాల కోసం నాయకులను వేడుకుంటుంటూ పదేళ్ల నుండి ఊరుకుని గెలిచి రెండేళ్లే అయిన మమ్మల్ని అడిగితే ఎక్కడి నుండి తెస్తామని అంటున్నారని వాపోయారు.

గ్రామాల‌లో త్రాగునీటి స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు సిపిఎం పాదయాత్ర బృందం ఎదుట వాపోయారు. గురవారం మండలంలోని ఆయా గ్రామాలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈసందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు జి. బాలకృష్ణ మాట్లాడుతూ మండలం లోని ఆయా గ్రామాల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వాటర్‌ట్యాంక్‌లు నిర్మించినప్పటికీ పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంలేదని అన్నారు. రుద్రవరం, దమ్మాలపాడు, తొండపి, పలుదేవర్లపాడు గ్రామాల్లో వీధిలైట్లు లేక చీకటిలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

'ఆధార్‌' ఉన్నా మరుగుదొడ్లకి అనుమతి ఇవ్వడంలేదు : సిపిఎం

:సమస్యల వలయంలో రేపల్లె పట్టణం కొట్టుమిట్టాడుతుందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రెండోరోజైన మంగళవారం నేతాజికాలనీలో ప్రారంభమై అనంతరం 2, 20 వార్డుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లంబాడీ కాలనీ, ఎస్టీకాలనీ వివిధ ప్రారతాల్లో పేదలు నివసిస్తున్న ఏరియాల్లో సమస్యలనడిగి తెలుసుకున్నామని చెప్పారు. మణిలాల్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఎస్టీకాలనీలో గతంలో 80 మందికి బీఫారం ఇచ్చారని అందరికి ఆధార్‌ కార్డులున్నా మరుగుదొడ్లు కట్టుకోవటానికి అవకాశం ఇవ్వటంలేదని చెప్పారు.

సిపిఎం పాదయాత్రలో సమస్యల వెల్లువ

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు, గృహ నిర్మాణాలను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మాణం చేపట్టి పూర్తిచేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, యన్‌.కాళిదాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం పెదనందిపాడు చేరింది. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సాగునీరు, తాగునీరు లేక దశాబ్దాలుగా అల్లాడుతుంటే అధికారం సాధించిన ఆయా పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో కాలం గడవటమే గాని, సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వాలే లేవన్నారు.

రాజధాని హామీలన్నీ నీటిమూటలే

ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయని దీనికి ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిదర్శనమని సిపిఎం రాజధాని కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానికి భూమి సమీకరణ క్రమంలో వ్యవసాయ కూలీలందరికీ రూ.2500లు పెన్షన్‌ అందిస్తామంటూ పేర్కొన్నారని, కానీ అందరికీ ఆయా పెన్షన్లు అందడంలేదని చెప్పారు. కేజీ టు పిజి ఉచిత విద్యను అమలుచేస్తానని చెప్పిన పాలకులు ఎక్కడ అమలుచేశారంటూ ప్రశ్నించారు. కేవలం మాటల గారడీ తప్పా ఆచరణలో కార్యాచరణ మాత్రం లేదన్నారు.

బేతపూడిలో పాతయాత్ర ప్రారంభం

సిపిఎం బాపట్ల డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర మంగళవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈ మని అప్పారావు ప్రారంభించారు. దళిత వాడలో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేదని, గ్రామంలో అంతర్గత రోడ్ల సౌకర్యం లేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. బేతపూడిలో లైబ్రరీ సెంటర్లో నివాసముంటున్న ప్రజలు గత కొన్నేళ్లుగా గ్రామకంఠానికిచెందిన భూమిలోనే ఇళ్ళు కట్టుకొని నివాసముంటున్నామని వాటికి ఇంతవరకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు.

సమస్యల వలయంలో శివారు కాలనీలు

నగరంలో పేదలు నివశించే కాలనీలలో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ప్రజా సమస్యల అధ్యయనం, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి వత్తిడి తెచ్చేందుకు సిపియం నగరంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి మూడోరోజుకు చేరుకుంది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పాదయాత్రలో పాశం రామారావు పాల్గొని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Pages

Subscribe to RSS - 2016