ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే పుష్కర ఘాట్లో ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారనీ, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, పుష్కరాల్లో మిగిలిన రోజులైనా ఎలాంటి అపశృతీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని క్షతగాత్రులు, బంధువులను ఆయన మంగళవారం పరామర్శించారు.