దేశంలో నిరుద్యోగం పెరుగుదల, ఉద్యోగాలు పెరగక పోవటాన్ని గురించి ఈమధ్య కార్పొరేట్ మీడియా చర్చ చేస్తున్నది. లేబర్ బ్యూరో చేసిన త్రైమాసిక సర్వేలో ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా ఉండే ఎనిమిది రంగాలైన బట్టల పరిశ్రమ, చేనేత వస్త్రాలు, బంగారు నగలు, నూలు ఉత్పత్తి, ఐటి రంగం, తోలు ఉత్పత్తులు, లోహాలు, ఆటోమొబైల్స్లలో 2014లో 4,90,000 మందికి, 2009లో 12,50,000 మందికి ఉద్యోగాలుకల్పించగా 2015లో 1,50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నట్లుగా వెల్లడి కావటం ఈ చర్చకు తక్షణ కారణం కావచ్చు. గ్రామీణ ఉద్యోగితకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నది.