'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం.