కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశమంతటా కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అరాచక చర్యలకు పూనుకుంటు న్నాయి. బిజెపికి చెందిన దళాలు, పరిషత్తులు, వాహినులు వీటిలో ముందెత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ శక్తులకు మద్దతిస్తున్నారు. శివసేన కూడా బిజెపి కంటే తానే ఒక ఆకు ఎక్కువ చదివాననే చందం గా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మైనారిటీలు, దళితులు, అభ్యుదయవాదులు, చింతనాపరులు, కవులు ఈ శక్తుల చేతుల్లో చంపబడుతున్నారు. అవమానాల పాలవుతు న్నారు. మైనార్టీల ప్రార్థనాలయాలు ధ్వంసమ వుతున్నాయి.