రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్. చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.