
1. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. 2008లో దేవస్థానం 419 ఉన్న ఇళ్ళ నిర్మాణాలపై సర్వే చేసిన వాటి ఆధారంగా 12149 ఇళ్ళను క్రమబద్దీకరణ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 60చ॥గజాల వరకు ఉచితంగా, 61-300 చ॥గజాల వరకు 1998 నాటి భూ మలువలో 70శాతం మరియు 9శాతం వడ్డీ, 301 చ॥గజాల పైబడిన వాటికి (రెండోకేటగిరి విలువ మరియు) ప్రస్తుత భూ విలువపై గృహయజమానులు ప్రభుత్వానికి డబ్బుచెల్లించి క్రమబద్దీకరించుకోవాలని ప్రభుత్వ క్యాబినెట్ ప్రకటించింది.
2. ప్రభుత్వం ప్రకటించిన పరిష్కారం ప్రజల దగ్గర నుండి డబ్బు గుంజి ఖజానా నింపుకునేలా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) భావిస్తున్నది. ఆ భూములపై అనేక సంవత్సరాలుగా హక్కు పొందుతున్న వేలాది మంది ప్రజానీకం హక్కును తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా డబ్బు చెల్లించి తమ ఇళ్ళను క్రమబద్దీకరించుకోవాలనటం దుర్మార్గం. గతంలో ప్రజలు భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పూర్తి డాక్యుమెంట్స్ కలిగి ఉన్నారు. నేడు తిరిగి వీరంతా డబ్బు కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించటం అన్యాయం. పై పెచ్చు 1998 నుండి విలువపై వడ్డీ కూడా చెల్లించాలనటం రాష్ట్ర ప్రభుత్వానికి తగనిపని.
3. పంచగ్రామాల భూ సమస్యకు మూలకారణం నాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996 వరకు లేని సమస్యను వివాదంలోకి తీసుకొచ్చి 2000లో 508 జివోను జారీచేసి డబ్బుచెల్లించి ఇళ్ళను క్రమబద్దీకరణ చేసుకోవాలని ఆదేశించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించలేదు. ఇళ్ళ నిర్మాణాలను, రిపేర్లను అడ్డుకుంది.
4. తొగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి 15నెలలు కాలయాపన చేసింది. నేడు ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం సహేతుకంగా లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జివో 296 ప్రకారం 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా నేడు ప్రకటించిన నిర్ణయంలో కేవలం 60 చ॥గజాల వరకే ఉచితంగా క్రమబద్దీకరిస్తామని నిర్ణయించటం సహేతుకం కాదు.
5. 2008 దేవస్థానం సర్వే తెలిపిన ఇళ్ళను మాత్రమే క్రమబద్దీకరణకు పూనుకోవటం సరైందికాదు. నేటికీ ప్రభుత్వం ఎలాంటి సర్వేచేయలేదు. అందువల్ల ఇప్పటివరకు ఉన్న ఇళ్ళనన్నింటిని క్రమబద్దీకరించాలని కోరుచున్నాం.
6. ఖాళీస్థలాలు యజమానులు సుమారు 4వేలకు పైగా ఉన్నారు. వీటిని కూడా క్రమబద్దీకరణ క్రిందకు తీసుకురావాలి.
7. రైతు భూముపై, సొసైటీపైన కూడా ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాని డిమాండ్ చేస్తున్నాం.