
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 మార్చి, 2026.
గ్యాస్ పెంపుదల ఉపసంహరించుకోవాలి
సిపిఐ(యం) డిమాండ్
వంట గ్యాస్ సిలిండర్కు రూ.60లు, వాణిజ్య సిలిండర్కు రూ.115లు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారింది. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంటగ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్ట గడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతేకాక అసంఘటిత కార్మికులు స్వల్ప ఆదాయాలు కలిగిన వారు కొనుక్కునే టిఫిన్, కర్రీ తదితర ఆహార ధరలు కూడా పెరుగుతాయి. అన్ని విధాల ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆక్సిజన్ సమాకురుస్తున్న టిడిపి కూడా ఒత్తిడి చేయాలని కోరుతున్నాం. గ్యాస్ భారాన్ని ఉపసంహారించాలని ఎక్కడికక్కడ నిరసన తెలపాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
