
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 ఫిబ్రవరి, 2026.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి ఘటనలపై హూంకరింపులతో సరిపెట్టుకోకుండా ఆచరణలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.
ఈ ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఎలా విచ్చలవిడిగా ఏరులై పారుతుందో అర్ధమవుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి ముఠాల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు. తూతూ మంత్రంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నది. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయి. నిందితులకు సరైన శిక్షలు పడడం లేదు. ఇటువంటి కేసులు పట్ల జాప్యం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిందితున్ని తమకు అప్పగించాలని ప్రజలు ఆందోళన చేయడమే దీనికి తార్కాణం. పోలీసులు రాత్రిపూట నిందితుని ఇంటి వద్దకు వెళ్లి ఇంటిలో తనిఖీ చేయకుండా వదిలివేయటం పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. నిందితుడు గంజాయి సేవించి అత్యాచారం, హత్య గావించడం మత్తు పదార్ధాల దుష్పభ్రావానికి నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని డ్రగ్స్, గంజాయి పట్ల కఠినంగా వ్యవహరించాలి. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
