
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 జూన్, 2025.
రాజధాని అమరావతి మరో దశ భూసమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి
రాజధాని అమరావతిలో మరో 44 వేల ఎకరాల భూములు సమీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. 11 సంవత్సరాల క్రితం సమీకరించిన 34 వేల ఎకరాల భూములలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయకుండా, మరో దశ సమీకరణ రాష్ట్ర అభివృద్ధికి, రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు, పేదల ప్రయోజనాలకు దోహద పడకపోగా, మరింత హాని చేస్తుంది. లేనిపోని భ్రమలు కల్పించి విస్తరణ పేరుతో కొత్త గ్రామాల్లో ప్రజలను బలవంతంగా ఒప్పించడం సరైంది కాదు.
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పరిశ్రమల అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ సమీకరణ చేయాలనుకుంటున్నది. గన్నవరంలో విమానాశ్రయం ఉండగా రాజధానిలో మరో విమానాశ్రయం పెడతామనడం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు తప్ప అభివృద్ధికి తోడ్పడదు. పరిశ్రమలు, విద్య, వైద్య సంస్థలు, స్పోర్ట్స్ ఇతర సౌకర్యాల కల్పనకు నవ నగరాల్లోనే ప్రణాళికలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టకుండా మళ్లీ వేల ఎకరాలు భూములు సమీకరించడం వాంఛనీయం కాదు. ఆ పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేయడం తగదు. పరిశ్రమలు రాష్ట్రమంతా వికేంద్రీకరించాలి. ఇప్పటికే లక్ష ఎకరాలు రిజర్వులో ఎపిఐఐసి దగ్గరున్నా ఒక్క పరిశ్రమా పెట్టలేదు. పైగా రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటున్నారు. వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే ఇది. కావున ప్రభుత్వం పునరాలోచన చేసి మలిదశ భూముల సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి.
11 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేయడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. పాలనకు అవసరమైన రాజధాని భవనాలు పూర్తి చేయకుండా అమలు కాని భారీ ప్రాజెక్టు చేపట్టి నష్టం చేశారు. ఇప్పుడు మరల అదే తప్పు చేస్తున్నారు. 2019 తర్వాత ఐదు సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డ రాజధాని ప్రజలను తిరిగి అస్థిరంపాలు చేయవద్దని కోరుతున్నాము.
భూములు ఇచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలకు పూలింగ్ చట్ట ప్రకారం ప్రయోజనాలు కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నేటికీ అందరికీ ప్లాటు సక్రమంగా ఇవ్వలేదు. సౌకర్యాలు కల్పించలేదు. ఉపాధి చూపలేదు. ఉచిత విద్య, వైద్యం తదితర హామీలు నెరవేరలేదు. గత హామీలు అమలు చేయకుండా మరల మలిదశ భూసేకరణకూ అవే వాగ్దానాలు చేస్తున్నారు. ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి