భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 జూన్, 2025.
బనకచర్లపై అఖిలపక్ష సమావేశం వేయాలి - సిపిఐ(యం) డిమాండ్
గోదావరి కృష్ణా అనుసంధానం పేరుతో పోలవరం నుండి బనకచర్ల వరకు 82 వేల కోట్లతో చేపట్టబోయే అతి భారీ ప్రాజెక్టుపై తక్షణం అఖిలపక్ష సమావేశం జరిపి పూర్తి వివరాలు వెల్లడిరచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ ప్రాజెక్టుపై రోజుకోరకంగా వస్తున్న వివరణ గందరగోళంగా ఉంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన నాటి నుండి పలువురు, ఇంజనీర్లు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సంతృప్తికరమైన వివరణ రాలేదు. తాజాగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యూటి (హమ్) స్కీమ్ క్రింది చేపట్టబోతున్నట్లుగా చేసిన ప్రకటన ఈ అనుమానాన్ని మరింతగా బలపరుస్తున్నది. ఈ ప్రాజెక్టు ఎవరి కోసం చేపట్టనున్నారు అనేది మౌలికమైన ప్రశ్నగా ముందుకు వచ్చింది. హైవేల తరహాలో నీటిపారుదల ప్రాజెక్టును సెల్ఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఎలా నిర్మించగలరని సిపిఎం ప్రశ్నిస్తున్నది. ప్రాజెక్టును బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి నీటిని కార్పొరేటీకరణ చేయటానికే ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడినట్లుగా కనిపిస్తున్నది. నీటిని అమ్ముకొని ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుతో సహా ఆయా కంపెనీలు లాభాలు పిండుకొనే అవకాశం ఉంది. రైతులు, మంచినీరు వాడుకునే సామాన్య ప్రజలపై నీటి చార్జీల భారం పడనున్నది. ఇది గేమ్ చేంజర్ అని అనటం లోనే ప్రకృతి వనరుగా ఉన్న నీటిని ప్రైవేటు పరం చేయటమనే అర్థం ఇమిడి ఉందని ఇప్పుడు స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే వాటిని లింకు చేసుకోవటం చాలా సులభమైన పని. రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని బనకచర్ల ప్రాజెక్టును పక్కన పెట్టి వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు తక్షణ ప్రాధాన్యనిచ్చి, నిధులు కేటాయించి పూర్తి చేయాల్సిందిగా సిపిఎం డిమాండ్ చేస్తున్నది. నదుల అనుసంధానం పేరుతో నీటిని ప్రైవేటీకరించి, ప్రజలపై భారాలు మోపవద్దని కోరుచున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి