పనిగంటల పెంపు దుర్మార్గం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూన్‌, 2025.

పనిగంటల పెంపు దుర్మార్గం

లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా జూలై 9న యావత్‌ కార్మికవర్గం దేశవ్యాపితంగా సమ్మెకు సన్నద్దమవుతున్న  దశలో మన రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్‌ కోడ్స్‌ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

8 గంటల పనికోసం పోరాడి సాధించుకున్న కార్మికవర్గంపై 12 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకం. కార్మికుల రక్తమాంసాలు పిండి కార్పొరేట్‌లకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పనిగంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణం. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నది. ఈ స్థితిలో పనిగంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సిందిపోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమైంది. తక్షణం లేబర్‌ కోడ్స్‌ను, దాని అనుబంధ రూల్స్‌ను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. దీనికి వ్యతిరేకంగా జూలై 9న జరగనున్న జాతీయ సమ్మెకు సిపిఐ(యం) పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. యావత్‌ కార్మికవర్గం ఐక్యంగా ఈ దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి