
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 జూన్, 2025.
నల్లబర్లి పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
రైతుల ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు
నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయాలని ఈనెల 5వ తేదీన గుంటూరులోని జిపిఐ కంపెనీ ఎదుట పొగాకు రైతులు చేసే ఆందోళనకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం నల్లబెర్లి పొగాకు వేయమని కంపెనీలు రైతుల్ని ఊరూరూ తిరిగి ప్రోత్సహించాయి. గత సంవత్సరం ధర ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉంటుందని నమ్మబలికాయి. అంతేకాకుండా నల్లబర్లితో పాటు మిర్చి ఇంకా ఏమైనా పంటలు వేస్తారేమో అలా వద్దు మొత్తం నల్లబర్లి వేయండి అని రైతులను ప్రేరేపించారు. కానీ బర్లి కొనుగోలులో కంపెనీలు చాలా దారుణంగా మోసం చేశాయి. కొనుగోలు చేయడానికే నిరాకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గుంటూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, సచివాలయంలో పలు దఫాలుగా కంపెనీలు రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కూడా పొగాకు కొనుగోలుపై సమీక్ష చేస్తూ రూ.12,500లు తక్కువ లేకుండా కంపెనీలు కొనుగోలు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రులు పర్చూరు మండలం మార్టేరులో రైతులతో ముఖాముఖి మాట్లాడి కంపెనీలు వెంటనే కొనుగోలు చేస్తాయని చెప్పారు. ఆరుగురు మంత్రు లతో ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ నిర్ణయాలు గాని ఇరువురు మంత్రులు పలువురు శాసనసభ్యులు పాల్గొని చెప్పినా, కంపెనీలు పొగాకు కొనుగోలు చేయకుండా ఆ సమావేశం చేసిన నిర్ణయాలకు విలువ లేకుండా చేశాయి. ప్రభుత్వం కంపెనీల దయాదాక్షిణ్యల మీద ఆధారపడినట్లు అనిపిస్తుంది. పి4 పేరుతో కార్పొరేట్ కంపెనీలు పేదల్ని ఉద్దరిస్తాయని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ కంపెనీలతో పొగాకు కొనుగోలు చేయించి రైతుల్ని ఉద్దరించలేకపోతుందన్న విషయాన్ని గుర్తించాలి. మార్కెట్లో రైతుల దుస్థితి చూస్తే కంపెనీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయన్న అనుమానం ఎవరికైనా కలగక మానదు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకొని నల్లబర్లి పొగాకు పంటను కొనుగోలు చేసి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి