అమెరికా వెళ్లే విద్యార్థుల వీసాలు తాత్కాలికంగా నిలిపివేయడం, సోషల్‌ మీడియా అక్కౌంట్‌ల తనిఖీపై ` రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నిబంధనలు తొలగించేందుకు కృషి చేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 29 మే, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: అమెరికా వెళ్లే విద్యార్థుల వీసాలు తాత్కాలికంగా నిలిపివేయడం, సోషల్‌  మీడియా అక్కౌంట్‌ల తనిఖీపై ` రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నిబంధనలు తొలగించేందుకు కృషి చేయాలని కోరుతూ...

అయ్యా!

భారతదేశం నుండి ఏటా 3 లక్షల మంది చదువుకోవడానికి అమెరికాకు వెళుతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుండి వెళ్లేవారు గణనీయంగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ నిర్ణయం వలన అనేకమంది విద్యార్థులకు వీసాలురాకుండా నిలిపివేస్తున్నారు. సోషల్‌ మీడియా అక్కౌంట్‌లను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతిస్తున్నారు. ఈ సంవత్సరం సుమారు 38% మందికి తిరస్కరించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. భారతదేశంలో వివిధ యూనివర్శిటీలలో వివిధ అభిప్రాయాలు కలిగిన విద్యార్థులుంటారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా సోషల్‌ మీడియాలో తెలుపుకునే అవకాశం ఉంది. అమెరికా గురించి దానికి వ్యతిరేకంగా ఉండే దేశాల గురించి భారత్‌లో ఉండే విద్యార్థులు తమ అభిప్రాయాలు పోస్ట్‌ చేయకుండా ఉండాలనటం అప్రజాస్వామికం. ఇప్పుడు ఆ పేరుతో విద్యార్థుల వీసాలు తిరస్కరించడం సరైంది కాదు.  అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు, ప్రోటోకాల్స్‌కి ఇది విరుద్దం. అమెరికా నుండి వచ్చే వారికి మన ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించడం లేదు. అప్పులు చేసి మరీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీసాలకు అప్లై చేసి ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విదేశీ విద్యకు సహాయమందిస్తున్నది. ఈ పరిస్థితులలో సోషల్‌ మీడియాలో పోస్టుల పరిశీలన చేసి, దాని ఆధారంగా వీసాలివ్వడం అంటే భారతదేశం పట్ల వివక్షత చూపడమే అవుతుంది. ఈ పక్షపాత ధోరణి వలన విద్యార్థులు తీవ్రంగా వివక్షకు గురై నష్టపోతారు.

కాబట్టి మీరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా అమెరికా కొత్తగా పెట్టిన నిబంధనలు ఉపసంహరించుకునేట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అదే సమయంలో అమెరికాతో పోటీపడగలిగిన నాణ్యత కలిగిన ఉన్నత విద్యకు ప్రభుత్వ రంగంలో మన దేశంలో కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి