అనకాపల్లిలో ప్రజల జీవనానికి, పర్యావరణానికి హనికరమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 17 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అనకాపల్లిలో ప్రజల జీవనానికి, పర్యావరణానికి హనికరమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరుతూ...

అయ్యా!

అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ థర్మల్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపిసి) ద్వారా 2 వేల ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను విరమించుకునేట్లు రాష్ట్ర ప్రభుత్వం కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణంతో ఆంధ్ర ప్రజానీకం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నేడు అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయని తెలిసి ఆ ప్రాంత ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

అణు విద్యుత్‌ప్లాంట్‌ ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలియనదికాదు. అంతర్జాతీయంగా రష్యాలో చెర్నోబిల్‌లో, అమెరికాలో ఐస్లాండ్‌, 2011లో జఫాన్‌లోని ఫుకుషిమాలో అణు ప్రమాదాలు తరువాత ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్‌ కేంద్రాల ఆలోచనలను విరమించుకున్నారు. అమెరికా తమ దేశంలో ఉన్న 4 అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేసింది. ఈ నేపధ్యంలో అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్‌ ప్లాంట్‌ నిర్మాణానానికి అనుమతులు అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెను ప్రమాదంలోకి నెట్టబడుతుంది. గాలి, నీరు, పర్యావరణంపై తీవ్ర ప్రమాదం పడుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈస్టర్‌ నేవల్‌ కమాండ్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, నేవల్‌ డాక్‌యార్డు, విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఎన్టీపిసి, బార్క్‌, ఫార్మా పరిశ్రమలు, ఎస్‌ఇజెడ్‌, ఎన్‌ఎఒబి వంటి కీలకమైన రంగాలు, పరిశ్రమలున్నాయి. అణు ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో ఈ ప్రాంతం విధ్వంసం అవుతుంది. అణు ప్రమాదం యొక్క తీవ్రత 80 కిలో మీటర్లు వరకు వుంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 30కిలో మీటర్లు పరిధిలో అణుధార్మిక ప్రభావం వుంటుంది. ప్రజల జీవితాలపై దుర్భర ప్రభావం పడుతుంది. ఇప్పటికే సముద్రతీరమంతా ఫార్మా కంపెనీలతో కలుషితమైంది. సాంప్రదాయ మత్స్యకారులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ ప్రమాదంలో వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాదులతో అక్కడ బాధపడుతూనే వున్నారు. ఈ ప్రమాద దుర్ఘటన వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే వందల సంవత్సరాలు పడుతుందని అనుభవం తెలియజేస్తుంది.  

2020లో విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌ విషవాయువుల లీకేజీ ప్రమాదం ఎంత విషాదం సృష్టించిందో మనందరికీ విధితమే. 2024 ఆగష్టు 21న అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 17 మంది మరణించి, 39 మంది క్షతగాత్రులయ్యారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. వీటితో పోల్చుకుంటే అణు విద్యుత్‌ తీవ్రమైన రేడియేషన్‌ కలిగి వుంటుంది. క్యాన్సర్‌, ఎక్యూట్‌ రేడియోషన్‌ సిండ్రోమ్‌, ఎనీమియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.

ఇలాంటి నేపథ్యంలో దేశ భద్రతాపరంగాను, ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దృష్ట్యా అణు విద్యుత్‌ ప్లాంట్‌కు భూములు కేటాయించరాదు. విద్యుత్‌ పెంపుకు సోలార్‌, విండో, పంపుడ్‌ స్టోరేజ్‌, పర్యావరణ రహిత గ్రీన్‌ ఎనర్జీ వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు వుండగా విషత్యులమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌కు అనుమతులు ఇవ్వరాదని కోరుతున్నాను. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకునేట్లు చూడాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి