విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారంకోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 జనవరి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారంకోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ... 

అయ్యా!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన తక్షణ సాయంగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. శాశ్వత పరిష్కార దిశగా ఇది మొదటి అడుగు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిలదొక్కుకోవాలంటే మరికొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రజల వాంఛ. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు దీనిని భవిష్యత్తులో ఆలోచించాలని అన్నారు. వెంటనే సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా పెట్టుబడి, మార్కెట్‌, గనుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంలో మీకున్న పలుకుబడిని ఉపయోగించి సెయిల్‌లో విలీనం జరిగే విధంగా చూడాలని కోరుచున్నాను.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థిరంగా లాభాలతో నడవాలంటే దానికి స్వంత గనులు కావాలి. ఇంతవరకు ప్రారంభమే కానీ ఆర్సిలార్‌ మిట్టల్‌ ఫ్యాక్టరీకి కూడా గనులు కేటాయించమని మీరు కేంద్రాన్ని కోరారు. పైపులైన్‌ ద్వారా సరఫరా జరిగేందుకు వీలుగా సొంత పోర్టును కూడా అనుమతించారు. మరి విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించరన్న ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తున్నది. గనులు కేటాయించకుండా సంక్షోభం నుంచి బయటపడటం కష్టం అని మీకు కూడా తెలుసు. కావున కేంద్ర ప్రభుత్వం తక్షణం గనులు కేటాయించే విధంగా మీ పలుకుబడిని ఉపయోగించాలని కోరుతున్నాను.

ప్యాకేజీ ప్రకటించడంతో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ప్రకటన చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా కార్మికుల ఆందోళనకు ముగింపు పలకాల్సి ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రయివేటీకరణను వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుండా ప్రైవేటీకరణ ప్రమాదం తొలగిపోదు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హృదయ స్పందనకు చిహ్నం. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన యావత్‌ పలుకుబడిని ఉపయోగించి ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర క్యాబినెట్‌ ఉపసంహరించుకునే విధంగా చూడగలరని కోరుతున్నాను. నష్టాల నుండి గట్టెక్కి ఇది ముందుకు నడపాలంటే అదొక్కటే అంతిమ పరిష్కారమని విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్యాకేజీ పేరుతో సిబ్బంది కుదింపును ఆమోదించరాదు. వలంటీర్‌ రిటైర్‌మెంట్‌ స్కీం ఉపసంహరింపచేయాలి. కాంట్రాక్టు వర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి. అప్పుడే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది. కార్మికులకు, ఉద్యోగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి