9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి -నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :30 నవంబర్‌, 2024.

9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి
-నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులపై శుక్రవారం మోపిన రు. 9,412 కోట్ల ఎఫ్‌ఎపిపిసి- ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలని సిపిఎం ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే విధించిన రు.6,029 కోట్ల ట్రూ అప్‌ చార్జీల వసూలు డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభం అవుతుండగా మరలా ఈ భారం వేయడం దారుణం. ఎపి ఇఆర్‌సి కనీసం పబ్లిక్‌ హియరింగ్‌ కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా ట్రూ అప్‌ విధించడం అన్యాయం, చట్ట విరుద్ధం. పారదర్శకత గురించి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడుతామని గొప్పలు చెప్పే పాలకులు ఇలాంటి నిరంకుశ పోకడలకు స్వస్తి పలకాలి.
అదాని కుంభకోణం వెల్లడైన నేపధ్యంలో అదనపు చార్జీలు కార్పొరేట్ల లాభాపేక్ష కోసమేనని రుజువైంది. ఈ భారాల్ని ప్రజలు భరించాల్సిన అవసరం లేదు. తాజా ప్రతిపాదన వల్ల 2025 జనవరి నెల బిల్లు నుండి రెండేళ్లపాటు నెల నెలా యూనిట్‌ కు 45- 46 పైసల చొప్పున అదనంగా చెల్లించాలి. ఇప్పటికే విధించిన ట్రూ అప్‌ చార్జీ యూనిట్‌ కు అదనంగా రు.1.27 వరకు చెల్లిస్తుండగా ఇప్పుదు ఇంకో 46 పైసలు పెరుగుతుంది. టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం నెలకు 30 యూనిట్లు వాడే నిరుపేదలు ఇంధన చార్జీగా రు.1.45 నిర్ణయించగా ట్రూ అప్‌ చార్జీగా యూనిట్‌కు రు. 1.73 అదనంగా చెల్లించాల్సి వుంటుంది. కాబట్టి పెంపుదల 120 శాతం అవుతుందన్నమాట. అంటే యూనిట్‌ రూ.3.18 అవుతుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని వాగ్దానం చేసిన టీడీపీ కూటమి గద్దెనెక్కాక మాట నిలబెట్టుకోలేదు. ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనంగా డబ్బు చెల్లించాలన్న ట్రూ అప్‌ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం  డిమాండ్‌ చేస్తోంది. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో తెగదెంపులు చేసుకోవాలని కోరుతున్నాము.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org