భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 నవంబర్, 2024.
సెక్రెటరీ గారికి,
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ,
కర్నూలు.
విషయం: 1) 2023-2024 ఆర్ధిక సంవత్సరపు FPPCA (Fuel and Power Purchase Cost Adjustment) చార్జీలకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్లు ఓ.పి నెం. 69/2024 ,70/2024 మరియు 71/2024 మరియు పేపరు ప్రకటన 04.11.2024 కు సమాధానంగా దాఖలు చేస్తున్న అభ్యంతరములు కొనసాగింపు... 2) బహిరంగ విచారణ జరపాలని అభ్యర్థన.
ఆర్యా!
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు సెకీ (SECI)తో ఒప్పందాలు చేసుకున్నాయి.
అవి కూడా "Must Run" కేటగిరీ అని పిటీషన్లలోనే స్పష్టం చేశారు. రాష్ట్ర
ప్రభుత్వ ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి థర్మల్ ప్లాంట్లను
నెలకొల్పింది. వాటి పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవటానికే అన్నది
స్పష్టం. వాటి పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోకుండా, ప్రైవేటు కంపెనీల
సోలార్ తప్పనిసరిగా వినియోగించుకోవలసిన కేటగిరీ క్రింద ఒప్పందం చేసుకోవటం
కేవలం ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయటానికి, రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రైవేటు
కంపెనీలకు ధారాదత్తం చేయటానికేనని భావిస్తున్నాము. అందుకే ఈ ఒప్పందాలను, ఈ
ఒప్పందాల ద్వారా ఏర్పడే ఎఫ్పిపిసిఏ (ట్రూఅప్) చార్జీలను
వ్యతిరేకిస్తున్నాము.
ప్రజలకు భారంగా మారే విధంగా సెకీ (SECI)తో ఒప్పందాలు చేసుకోవటం వెనుక
అవినీతి ఉందని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తూర్పు న్యూయార్కు
జిల్లాలో ఉన్న జిల్లా కోర్టులో 24 అక్టోబర్, 2024 వతేదీన క్రైమ్ నెంబర్
24-CR -433గా కేసు నమోదై ఉన్నది. ఈ కేసు పిటీషన్లోని 46,47,48,49 పేరాల
ప్రకారం సెకీ ఒప్పందాలు పూర్తిగా అవినీతితో కూడుకున్నవని, ఆదానీ
ఆధ్వర్యంలోని 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను దీర్ఘ కాలం కొనేందుకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
పెద్దలకు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారని పిటీషన్లో ఉన్నది. ఇలా అవినీతికి
పాల్పడి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను కొనటానికి ఎ.పి.డిస్కంలు
సెకీతో 25 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయని, అవినీతివలననే వాటిని
"Must Run" కేటగిరీగా ఒప్పందం చేసుకున్నారని, ఈ అవినీతితో కూడిన
విద్యుత్ను కొనటంకోసం రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని థర్మల్ ప్లాంట్ల
విద్యుత్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయనీయకుండా తగ్గించివేశారని
స్పష్టంగా తెలుస్తున్నది. అవినీతితో కూడిన ఈ సోలార్ ఎనర్జీ కొనుగోళ్లకు
సంబంధించిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని, దీనిపై విచారణ జరిపించాలని,
మిగిలిన పిపిఏలను కూడా రివ్యూ చేయాలని కోరుతున్నాము.
గతంలో కొన్న విద్యుత్కు ఇప్పుడు చార్జీలు విధించటం అంటే గత విద్యుత్
చార్జీల టారీఫ్ను ఇప్పుడు పెంచటమే అవుతుంది. అందుకే ఇది వాయిదా వేసిన
చార్జీల టారీఫ్ పెంపుదలగా భావిస్తున్నాము. ఏసరుకుకు లేని విధంగా గతంలో
వాడిన దానికి ఇప్పుడు రేట్లు పెంచి వసూలు చేయటం దారుణం. అందువలన ఈ
ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము.
నివాస గృహాలకు, షాపులు, సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదాని
సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు
చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనివలన విద్యుత్ వినియోగదారులపై వేలాది
కోట్ల రూపాయల భారం పడుతుంది. అదానీ ఇతర సంస్థలతో కుదుర్చుకున్న స్మార్ట్
మీటర్ల ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నాము. స్మార్ట్ మీటర్ల బిగింపు
నిలిపివేయాలని విజ్ఞపి చేస్తున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదానీ సంస్థలతో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఒప్పందాలు
చేసుకుంటున్నారు. భూములు కేటాయిస్తున్నారు. వీటిని నిలుపుదల చేసి,
ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నాము.
బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి
గౌరవ విద్యుత్ నియంత్రణ మండలివారు ఈ అంశంపై బహిరంగ విచారణ జరుపు తేదీని
ప్రకటించలేదు. విద్యుత్ వినియోగదారులు అనేకమంది అనేక రకాలైన అభిప్రాయాలను
వ్యక్తంచేస్తున్నారు. అందువలన కేవలం వ్రాతపూర్వకమైన అభ్యంతరములకే పరిమితం
కాకుండా ఈ అంశంపై బహిరంగ విచారణ నిర్వహించాలని, దానికి తగిన తేదీని
ప్రకటించాలని గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి వారికి విజ్ఞప్తి
చేస్తున్నాము.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org