కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై మాటలు ఘనం - నిధులు స్వల్పం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 జూలై, 2024.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై మాటలు ఘనం - నిధులు స్వల్పం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. మాటలు ఘనం చేతలు శూన్యం అన్నట్లుగా వుంది బడ్జెట్‌. ఎన్నికలనంతరం ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలుకు నిధులు కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది.
ఆర్థికమంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ పేరు పలుసార్లు ప్రస్తావించారు. కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించింది. చెప్పిన మాటల్లో కూడా స్పష్టత లేదు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి కేంద్రం ప్రయత్నించింది.
రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామని మంత్రి పేర్కొనటం వల్ల రాస్ట్రానికి, రాజధానికి మేలు జరగదు. 15 వేల కోట్ల రూపాయలు నేరుగా గ్రాంటుగా ప్రకటించాలి. వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇప్పించడం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం.
పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధుల ప్రస్తావన లేదు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన రెండు పారిశ్రామిక కారిడార్లకూ నిధుల గురించి ప్రస్తావన లేదు. పోలవరానికి 12 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్‌లో స్పందన లేదు. నిర్వాసితుల్ని గాలికొదిలేశారు.
ప్రత్యేక హోదా ఊసే లేదు. రైల్వే జోన్‌, కడప ఉక్కు, మెట్రో, విద్య, వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్‌లో చోటు చేసుకోలేదు. గత పది సంవత్సరాల నుండి విభజన చట్ట ప్రకారం నిధులు కేటాయించకుండా బిజెపి నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్‌లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవు.
పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా, ఆంధ్రప్రదేశ్‌, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంపైనా, బిజెపిపైనా రాజకీయ ఒత్తిడి తేవాలి. బడ్జెట్‌లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేంద్రాన్ని, బిజెపిని నిలదీయాలి.  కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల పైన ఒత్తిడి తేవాలి. పార్లమెంటులో మన రాష్ట్ర యంపీలు బడ్జెట్లో న్యాయం కొరకు పోరాడాలి.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి