అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోడీ మన్‌కీబాత్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 జూలై, 2024.

అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోడీ మన్‌కీబాత్‌

ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్‌ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీ గుర్తింపు పొందింది. దీనిని మోడీ గారు తన మన్‌కీబాత్‌లో గుర్తించకపోవడం అన్యాయం. రైతుల్ని విస్మరించి కాఫీ సొగసు గురించి మాట్లాడడం మోసం చేయడమేనని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. దేశ ప్రధాని మోడీగారు మన్‌కీబాత్‌లో చంద్రబాబునాయుడు గారితో కాఫీ త్రాగిన ఫొటోని పోస్ట్‌చేసి, అరుకు కాఫీ ఆర్గానిక్‌ కాఫీ రుచికి శ్రేష్టమైనదని జి.20 సదస్సుకు హాజరైన అందరికి అరకు కాఫీ అందించామని తెలిపారు. కాఫీ త్రాగిన ప్రతినిధులు కూడా అద్భుతమని కొనియాడారని ప్రధాని అన్నారు. ఇంత అద్భుతమైన కాఫీని పండిస్తున్న 1.5 లక్షలు   రైతుల శ్రమ, గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించకపోవడం అన్యాయం.

దేశంలో పర్యావరణ సమతుల్యత కోసం గిరిజన ప్రాంతంలో పండే కాఫీ పంట. ఈ పంట విశాఖ ఎజెన్సీకి అనువైన పంట. దీని కోసం 1982 నుండి విశాఖ ఏజెన్సీలో కాఫీ, సిల్వర్‌ సాగును ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పోడు వ్యవసాయానికి స్వస్తిపలికి కాఫీ, మిరియాలు పంటలను సాగు చేస్తూ ఆదివాసీలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. అదివాసీ కాఫీ రైతులకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నారు. వాతావరణం అనుకూలించనప్పడు కాఫీ పంటరాక రైతులు తీవ్రగా నష్టా పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాఫీ పంటకు కనీసం ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించడం లేదు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల నుండి కాఫీ రైతులకు ఇస్తున్న ప్రోత్సహకాలు తగ్గించేసింది. 2018 నుండి ఇవ్వవలిసిన 62 కోట్లు ప్రోత్సహక నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలవలన ఎ.పి.ఎఫ్‌.డి.సి, కాఫీ ఎస్టేట్‌లు మూతపడుతున్నాయి. కాఫీ బోర్డును నిర్వీర్యం చేస్తున్నారు. ఫలితంగా గిరిజనులు ఉపాధి కొల్పుతున్నారు. గిరిజన భూములలో పండిస్తున్న కాఫీ తోటలలో ఉపాధి పథకం ద్వారా పనిచేస్తున్న పనులు కూడా నిలుపుదల చేసారు. అట్లాగే ఉపాధి నిధులు కేటాయించకుండా గిరిజనులకు ద్రోహం చేస్తున్నారు. జిసిసి ద్వారా కాఫీ గింజలు కొనుగోలు చేయాలి. జిసిసికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో జిసిసి రైతుల నుండి తక్కువ కాఫీ గింజలు కొంటున్నది. దీనితో ప్రైవేటు ధళారీలు, స్వచ్చంద సంస్థలు ఇష్టారాజ్యంగా తక్కువ ధరలకు కొనుగోలుచేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.

ప్రధాని మోడీ గారికి అరకు కాఫీపై ప్రేమ ఉంటే నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలి. కాఫీ బోర్డుకు, ఎ.పి.ఎఫ్‌.డి.సి, జిసిసిలకు నిధులు కెటాయించి బలోపేతం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి