ప్రచురణార్థం : 2024 మే 05 న ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గార్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాసిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
విజయవాడ,
తేది : 05 మే, 2024.
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,
ఆంధ్రప్రదేశ్,
రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.
విషయం: పోస్టల్ బ్యాలెట్ లో గందరగోళాన్ని తొలగించడంపై
అయ్యా!
రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల్లో పోస్టల్ బ్యాలెట్పై గందరగోళం నెలకొంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు జరగడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ట్రైనింగ్ క్లాసుల వద్ద పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ రాలేదని చివరి నిమిషంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు చెప్పారు. ట్రయినింగ్ అయిపోయిన వారు ఎక్కడ ఓటు వేయాలో తెలియక ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ఫామ్ 12 సమర్పణతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఏ నియోజకవర్గ పరిధిలో ఉంటే అక్కడే ఓటు వేయమని అంటున్నారు. బ్యాలెట్ ఓటు వేసేందుకు 4వ తేదీన మచిలీపట్నం రావాలని సంబంధిత ఉద్యోగులకు తెలియజేసి ముందస్తు సమాచారం లేకుండా 6వ తేదీకి వాయిదా వేసారు. సత్యసాయి, విజయవాడలో 3 గం॥లు ఆలస్యమైంది. ఎండ ఉక్కపోత కారణంగా గంటల తరబడి క్యూలైన్లలో ఉండటం వలన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒంగోలులో ఓటరు ధృవీకరణ పత్రంలో గెజిటెడ్ అధికారుల సంతకం చేయలేదు. సత్యసాయి జిల్లాలో 150 ఓట్ల వరకు గల్లంతయ్యాయి. ఏలూరులో ఫామ్ ` 12 ఎక్కడ అందజేసారో అక్కడే ఓటు వేయాలని అధికారులు చెప్పారు. ఈ గందరగోళం తొలగించి స్వేచ్ఛగా ఇబ్బందులు లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను.
అవసరమైతే అంగన్వాడీ ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియ చివరిలో ఉపయోగించుకుంటామని అధికారులు అంటున్నారు. చివరి నిమిషంలో ఎన్నికల పనిలో ఉంటే ఓటు వేసే అవకాశం ఉండదు. అటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు మే 13 తరువాత నైనా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి