విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఏప్రిల్‌, 2024.

 

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలకోసం వారిని ఈరోజు పిలిపించుకొని మాట్లాడడంలో నిజాయితీ లేదు. కనీసం వారిని కలిసిన సందర్భంలోనైనా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపేందుకు తాను నిలబడతానని మాటమాత్రంగానైనా చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గనులను కేటాయించేందుకు కూడా హామీ ఇవ్వలేదు. ఈ మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢల్లీి వెళ్ళినా ఒక్కసారి కూడా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపమని ప్రధానిని అడిగిన పాపాన పోలేదు. ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంలో కూడా ఆయనకు కనీసం అర్జీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్లకోసం కార్మికులను మోసం చేసేందుకు ప్రకటన చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి భయపడి విశాఖ ఉక్కును ఫణంగా పెట్టడం దారుణం. 

విశాఖ ఉక్కు విషయంలో వైసిపి, టిడిపి, జనసేనలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. మూడు పార్టీలు ఒకవైపు ప్రయివేటీకరిస్తున్న బిజెపికి మద్దతునిస్తూ మరోవైపు పోరాడుతున్న కార్మికుల పక్షం తామున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా వీరి అసలు రంగును గర్తించాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వామపక్షాలను ఆదరించాలని కోరుతున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి