కార్పొరేట్ల కోసమే విద్యుత్‌ సంస్కరణలు- సిపిఎం రాష్ట్ర సదస్సు

- డేటా సేకరణ కోసమే స్మార్ట్‌ మీటర్లు
- ప్రీపెయిడ్‌తో వ్యవసాయ పంపుసెట్లకు ఆటంకం
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి:కార్పొరేట్‌ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే విద్యుత్‌ సంస్కణలను అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ వస్తు సామగ్రి డేటాను సేకరించి ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడతారని తెలిపారు. 'విద్యుత్‌ సంస్కరణలు - ప్రజలపై భారాలు' అన్న అంశంపై విజయనగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం చేయాలంటూ సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత తులసీదాస్‌ మాట్లాడుతూ.. అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తలగ్గారని అన్నారు. ఇందులో భాగంగానే విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు వైసిపి ప్రభుత్వం పూనుకుంటోందని తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులపై ఆర్థిక భారం, ప్రయివేటు పరిశ్రమల మనుగడకు ఇబ్బంది కలగడమే కాకుండా పాలిటెక్నిక్‌, ఐటిఐ వంటి అర్హతలతో పనిచేస్తున్న స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతవుతాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్‌ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన, రిజర్వేషన్లు అమలు వంటివి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. విద్యుత్‌ రంగంలోనూ ప్రీపెయిడ్‌ విధానం అమల్లోకి వస్తే సెల్‌ఫోన్ల రీఛార్జ్‌్‌ మాదిరిగా నిర్థేశించిన యూనిట్ల వినియోగం తరువాత ఆటోమేటిక్‌గా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడడంతోపాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు అనంతరం రైతుల చేతిలో బిల్లులు పెట్టే పరిస్థితి ఏర్పడబోతుందని తెలిపారు. సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం సిపిఎం చేపట్టిన విద్యుత్‌ ఉద్యమంలో ప్రజలు తమ ప్రాణాలను సైతం ఫణ్ణంగా పెట్టి పోరాడారని గుర్తుచేశారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపి ప్రాణాలు తీసిందని, చివరకు విద్యుత్‌ భారాల పెంపును విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు ఆ తరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాహసం చేయలేకపోయారని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ట్రూఆప్‌, ఎఫ్‌పిపిసి సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడంతోపాటు మొత్తం విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనివల్ల ఫెర్రోఎల్లాయీస్‌ తదితర పరిశ్రమలు ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు. ఈ విధానాన్ని సిపిఎంతోపాటు సిఐటియు వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజలను, కార్మికవర్గాన్ని చైతన్యపరచి మరో విద్యుత్‌ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, తదితరులు పాల్గొన్నారు.