
సిపిఎం బాపట్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర మంగళవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈ మని అప్పారావు ప్రారంభించారు. దళిత వాడలో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేదని, గ్రామంలో అంతర్గత రోడ్ల సౌకర్యం లేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. బేతపూడిలో లైబ్రరీ సెంటర్లో నివాసముంటున్న ప్రజలు గత కొన్నేళ్లుగా గ్రామకంఠానికిచెందిన భూమిలోనే ఇళ్ళు కట్టుకొని నివాసముంటున్నామని వాటికి ఇంతవరకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు. ఐఎవై పథకం కింద ఇళ్ళుకట్టించే సందర్భంలో సర్టిఫికెట్ ఇచ్చి తిరిగి తహశీల్ధార్ కార్యాలయంలోనే ఉంచుకున్నారని, గ్రామంలో రోడ్లు మంచినీటిసమస్య తీవ్రంగా ఉందని పాదయాత్ర బృందానికి గ్రామస్తులు ఎకరువు పెట్టారు. పాదయాత్ర తొలిరోజు బేతపూడితో పాటు కొత్తపాలెం, వెదుళ్లపల్లి, మదర్ థెరిస్సాకాలనీ, కృపానగర్కాలనీ, వికలాంగుల కాలనీలో పాదయాత్ర నిర్వహించారు.