కూలిన సచివాలయ గోడ ఐదుగురికి తీవ్రగాయాలు

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌చంద్‌, ధర్మేంద్ర, కిరణ్‌ఛౌదరి, జయరామ్‌లతోపాటు మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. వీరిలో రామ్‌చంద్‌కు వెన్నుముక విరిగిపోగా ధర్మేంద్రకు తలకు, ఛాతికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ కార్మికులు సచివాలయంలో షాపోజి, పల్లోంజి కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. సోమవారం యధావిధిగా పనిలో ఉండగా పై అంతస్తుకు కట్టిన పిట్టగోడ కూలి కింద ఉన్న కార్మికులపై పడింది. సచివాలయం నిర్మాణం ప్రారంభమైన తరువాత వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా బాధితులకు నష్టపరిహారమివ్వాలని, దీనికి బాధ్యతగా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఎదుట సిపిఎం నాయకులు ధర్నా చేశారు