
గ్రీస్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐరోపా యూనియన్(ఇయు), యూరపు సెంట్రల్ బ్యాంకు (ఇసిబి), అంతర్జాతీయ ద్రవ్యనిధిó త్రయం గ్రీస్ ఆర్థిక రోగానికి ఇచ్చిన మందు వికటించి ఆ దేశాన్ని మరింత తీవ్రమైన రోగానికి గురిచేయగా ప్రపంచీకరణ యుగంలో దాని జబ్బు ఇప్పుడు యూరప్కూ, ఇతర దేశాలకూ పాకుతోంది. దుష్ట త్రయంగా గ్రీకు ప్రజలు పిలుస్తున్న ఈ మూడు ద్రవ్య సంస్థలు గ్రీకు బ్యాంకులకిచ్చే రుణాలపై పరిమితులు విధించడంతో ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సంక్షోభానికి మూలాలు యూరపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. దానికి మూలాలు 2008లో అమెరికాలో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దిగ్గజాలు యూరోజోన్లో బలహీనంగా ఉన్న గ్రీస్ లాంటి దేశాలపైకి నెట్టివేయాలని చూసిన ఫలితమే ఈ సంక్షోభం. గత అయిదేళ్లుగా 'పొదుపు చర్యలు' పేరుతో ఈ ఐరోపా ఫైనాన్షియల్ త్రయం సాగిస్తున్న దాడికి ఇది పరాకాష్ట. ఈ అత్యయిక పరిస్థితిని అధిగమించేందుకు సోమవారం బ్యాంకులన్నిటినీ గ్రీస్ ప్రభుత్వం మూసివేసింది. స్టాక్ మార్కెట్లకు వారం రోజుల పాటు విరామం ప్రకటించింది. ఎటిఎంల నుంచి రోజుకు 60 యూరోలకు మించి నగదు తీసుకోకుండా పరిమితులు విధించింది. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను గ్రీస్ పరిధిలోనే సాగించాలని నిబంధన పెట్టింది. విదేశాలకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపడాన్ని నిషేధించింది. బెయిలవుట్ ఒప్పందంపై జులై 5న రిఫరెండం జరిగే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని డిక్రీ జారీ చేసింది.
ఐరోపా ఫైనాన్షియల్ బ్యాంకులు, రుణదాతలు కలిసికట్టుగా సృష్టించిందే ఈ సంక్షోభం. దీని దెబ్బకు గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే 500 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూసింది. సిడ్నీ నుంచి వాల్స్ట్రీట్ దాకా అన్ని స్టాక్మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్పై కూడా ప్రభావం పడింది. ఇది 2008లో లేమన్ బ్రదర్స్ సంక్షోభం కన్నా తీవ్రమైనదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2009లో గ్రీస్ పరపతిని క్రెడిట్ రేటింగ్స్ సంస్థలు తగ్గించడంతో ఈ సంక్షోభ జాడలు బయటపడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకుని గ్రీస్ను తన రుణచట్రంలో బంధించేందుకు ఇయు పథకం వేసింది. దానిలో భాగంగానే 2010 మేలో 14,600 కోట్ల డాలర్ల బెయిలవుట్ ఒప్పందాన్ని గ్రీస్పై రుద్దింది. ఆ ఒప్పందమే గ్రీస్ పాలిట యమపాశంలా మారింది. ఆ ఒప్పందం మాటున పొదుపు చర్యల పేరుతో విధించిన షరతులు గ్రీస్ను సర్వనాశనం చేశాయి. ప్రజల కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీశాయి. అప్పటికే బలహీనపడిన గ్రీస్ ఆర్థిక వ్యవస్థను మరింత అథ్ణపాతాళానికి నెట్టాయి. అంతిమంగా గ్రీస్ రుణభారం నేడు 3,400 కోట్ల డాలర్లకు చేరుకునేలా చేశాయి. గ్రీస్ వార్షిక స్థూల ఆదాయం కన్నా ఈ అప్పు రెండు రెట్లు ఎక్కువ. దేశంలో నిరుద్యోగం విశ్వరూపం దాల్చింది. పింఛన్లపై ఎడాపెడా కోతలు పెట్టడంతో 90 శాతం మంది రిటైర్డు ఉద్యోగుల పింఛన్లు దారిద్య్ర రేఖకన్నా దిగువ స్థాయికి పడిపోయాయి. ఇయు రుద్దిన ఈ పొదుపు చర్యలపై గ్రీకు ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం అయిదు మాసాల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిబింబించింది. పొదుపు చర్యలను వ్యతిరేకించిన సిరిజా పార్టీకి వారు పట్టం గట్టారు. అంతకుముందున్న కన్సర్వేటివ్ సమ్రాస్ను మట్టి కరిపించారు. ఆ ఎన్నికల్లో ప్రజాకంటక పొదుపు చర్యలను రద్దు చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చిన సిరిజా, అధికారంలోకి వచ్చిన తరువాత ఇయు సంస్థలతో చర్చలు తిరిగి ప్రారంభించింది. రుణ ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ను గట్టెక్కించేందుకు షరతుల్లేని రుణం ఇవ్వాలని కోరారు. దీనికి ఇయు కూటమి అంగీకరించకపోగా మరిన్ని కఠిన షరతులు విధించింది. దీనిని అంగీకరిస్తే తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంతో సిరిజా వ్యూహాత్మకంగా రిఫరెండమ్ మార్గాన్ని ఎంచుకుంది. నిజానికి రిఫరెండం అవసరమే లేదు. ఆ ఒప్పందాన్ని నేరుగా తిరస్కరించవచ్చు. రిఫరెండమ్కు వెళ్లాలని నిర్ణయించడంలో సిరిజా ప్రభుత్వ ఊగిసలాట ధోరణి ప్రస్ఫుటమవుతోంది. బెయిలవుట్ ఒప్పందంపైన, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన 47 పేజీల నివేదికపైన రిఫరెండమ్ జరుగుతుంది. దీనిని కూడా ఇయు సహించలేకపోయింది. గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే గ్రీస్కు రుణ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చేయడం ద్వారా గ్రీస్లో అశాంతి, అలజడిని రేపి అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరంపాల్జేయాలన్న కుట్ర కూడా దాగివుంది.
నిజానికి గ్రీస్ పరిణామాలు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు పట్టిన పెద్ద జబ్బులో భాగం. 2008 సంక్షోభం నుంచి బయటపడడానికి వివిధ దేశాలు ఫైనాన్స్ సంస్థలకు బెయిలవుట్ ప్రకటించడం ద్వారా సంక్షోభాన్ని ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వాలకు బదలాయించాయి. ప్రభుత్వాలు సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రజలపై భారాలు వేయనారంభించాయి. పరిమితికి మించి ప్రజలు భారాలు మోయలేని పరిస్థితుల్లో మొత్తం వ్యవస్థే సంక్షోభానికి గురవుతోంది. అందువల్ల గ్రీసు సంక్షోభం కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. మన రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే హెచ్చిరించినట్లు ఇది 1930ల మాదిరిగా ఒక పెద్ద సంక్షోభానికి సూచిక. ధనిక దేశాలు మేలుకోకపోతే ఆ సంక్షోభం త్వరలోనే ముంచుకొస్తుంది.