
అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 'రాజ్యాంగం-అంబేద్కర్'పై లోక్సభలో చేపట్టిన చర్చ గురువారం కొంత ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు రాజ్యాంగంలోని ఒక క్లాజు కారణమని, అందువల్లే విభజనకు వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీ శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ నాటి యుపిఎ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించిందని టిడిపి ఎంపీ రామ్మోహన్నాయుడు ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. రామ్మోహన్నాయుడు వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఆయన ప్రసంగాన్ని అడ్డగించారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ టిడిపి అధ్యక్షుడు రాష్ట్రపతికి లేఖ రాశారని ఎంపీ జితేందర్రెడ్డి స్పష్టం చేశారు. పైగా అధికార దాహంతోనే 2009లో తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్తో పొత్తుపెట్టుకుందని ఆయన విమర్శించారు.