రాముడి జన్మస్థలం పాకిస్థానా?

హిందువులు భగవానుడుగా భావించే రాముడు పుట్టింది అయోధ్యలో కాదా? అసలాయన పుట్టింది త్రేతా యుగంలోనే కాదా? కాదనే తాజాగా వెలువడ్డ ఒక పుస్తకం చెబుతోంది. 'ఫ్యాక్ట్స్‌ ఆఫ్‌ అయోధ్య ఎపిసోడ్‌ - మిథ్‌ ఆఫ్‌ రామ్‌ జన్మభూమి (అయోధ్య ఉదంతం వాస్తవాలు - రామ జన్మభూమి భ్రమ)' అనే పేరున్న ఈ పుస్తకాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) సభ్యుడు అబ్దుల్‌ రహీం ఖురేషీ రాశారు. రాముడు గంగా మైదానంలో జన్మిం చినట్టు వేదాల్లో గానీ, పురాణాల్లో గానీ ఎక్కడా పేర్కొనలేదని ఖురేషీ వాదిస్తున్నారు. రాముడి తండ్రి దశరథ మహారాజు పాలించిన సప్తసింధు ప్రాంతం నిజానికి హర్యానా, పంజాబ్‌ల నుంచి పాకిస్తాన్‌ గుండా ఆఫ్ఘనిస్తాన్‌ తూర్పు కొస దాకా వ్యాపించిన ప్రాంతమని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలోని రహ్మాన్‌ ధేరీ అనే పట్టణం రాముడి అసలు జన్మస్థలమని భారత పురాతత్వ సర్వే సంస్థ (ఎఎస్‌ఐ) పూర్వ అధికారి జస్సూ రామ్‌ వెల్లడి చేశారని ఆయన ఉటంకించారు. ఇప్పుడు రహ్మాన్‌ ధేరీ అని పిలుస్తున్న పట్టణాన్ని గతంలో రామ్‌ ధేరీ అని పిలిచే వారని ఖురేషీ చెబుతున్నారు.