MLC శర్మ మౌన దీక్ష

విశాఖ జిల్లా గ్రంథాలయ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు మౌనదీక్ష చేపట్టారు. ఎయు మాజీ వీసీ ప్రొఫెసర్‌ కెవి రమణ దీక్షను ప్రారంభించగా, పౌర గ్రంథాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు బిఎల్‌ నారాయణ అధ్యక్షత వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సాగిన దీక్షను పలువురు ప్రముఖులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజరుశర్మ మాట్లాడుతూ, స్వార్థం కోసం కనీస విలువలు పాటించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ పదవులు పొంది ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్న నాయకుల నుంచి విశాఖను రక్షించుకోవాలన్నారు. సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్సీ శర్మకు ప్రజా స్పందన అధ్యక్షులు సిఎస్‌ రావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.