CRDA కార్యాలయాల ముట్టడి..

 రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు, భూసేకరణపై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని క్రిడా కార్యాలయాలను స్థానికులు సోమవారం ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, గ్రామాలను ఖాళీ చేయించేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.
తొలుత గ్రామకంఠంలోని కొన్ని ఇళ్ళను తొలగించి ఆ తరువాత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి చేస్తున్న ప్రయత్నాలు దానిలో భాగమేనన్నారు. మధ్యాహ్నం నిడమర్రులో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ స్థానిక క్రిడా కార్యాలయాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం భూ దాహంతో భూ బకాసురుడిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిన్నటి వరకూ భూపూలింగ్‌ అన్నారని, ఆ తరువాత గ్రామాల పూలింగ్‌కు దిగారని, రాబోయే కాలంలో శ్మశానాల పూలింగ్‌నూ మొదలు పెట్టబోతున్నారని చెప్పారు. మరోవైపు తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు కదిలొచ్చి తాళాలేశారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించే వరకూ తామూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ కలెక్టర్‌ ఝాన్సీలక్ష్మిని నిలదీశారు.
భూ సేకరణను వ్యతిరేకరిస్తూ తుళ్లూరులో క్రిడా కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.