1975 ఎమర్జన్సీ సరైనదే..

దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. ఆ నిర్ణయం సరైనదేనని ప్రజలు గ్రహించారని, ఇందిరాగాంధీకి ఓటు వేసి తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. సోమవారం ఆయన ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఎందుకు మేం క్షమాపణ చెప్పాలి? అత్యవసర పరిస్థితిపై ఎందుకు చరించాలి? కొన్ని సంఘటనలు జరిగాయి. ఆతర్వాత దేశ ప్రజలు మళ్ళీ ఇందిరాగాంధీని ప్రధానిగా ఎన్నుకున్నారు. అందువల్ల మేం క్షమాపణ చెప్పాలంటే, అప్పుడు భారత ప్రజలు కూడా క్షమాపణ చెప్పాల్సి వుంటుంది. ప్రజలు ఇందిరనే మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నారు' అని అన్నారు. ఆసమయంలో అత్యవసర పరిస్థితి విధించడం సరైనదేనని అప్పటి ప్రభుత్వం భావించింది కనుక చరిత్ర తవ్వుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అత్యవసర పరిస్థితి విధించడం తప్పు అనుకున్న ప్రజలు మమ్మల్ని అధికారం లోకి రాకుండా చేశారు. తర్వాత అది సరైనదేనని భావించారు కాబట్టే మళ్ళీ మాకు అధికారం కట్టబెట్టారని అన్నారు. ఎమర్జన్సీకి కాంగ్రెస్‌ క్షమాపణ చెబుతుందా? అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఆనాడు అలా జరగడానికి సంబంధించిన అనేక అంశాలు వున్నాయి, అలాగనుకుంటే ప్రతిపక్షం కూడా క్షమాపణ చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే ఎమర్జన్సీ విధించే పరిస్థితులను ఆనాడు వారు సృష్టించారని అన్నారు