రాజధాని భూముల్లో సాగు

ల్యాండ్‌ పూలింగ్‌లో భూములివ్వని నిడమర్రు పొలాల్లో విత్తనాలు వేసి సాగు పనులను సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ప్రారంభించారు. తొలుత నిడమర్రు గ్రామంలోనుండి పొలాల వరకు వైసిపి, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రత్నారెడ్డి పొలంలో ట్రాక్టర్‌తో దున్ని వరి విత్తనాలను చల్లారు. నీరుపెట్టి మట్టిని చదునుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు మాట్లాడు తూ జపాన్‌, సింగపూర్‌, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజ నాలు చేకూర్చి లబ్ధిపొందేందుకు టిడిపి ప్రయత్నిస్తుంద న్నారు. దానిలో భాగంగానే వేలాది ఎకరాల సమీకరించిం దన్నారు. అటవీభూముల పేరుతో మరో 28వేల ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని విమర్శిం చారు. ప్రభుత్వ కుట్రలను ప్రజాపోరాటాల ద్వారా అడ్డుకుం టామన్నారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు తమ భూముల్లో సాగుకు ఉపక్రమించడం ప్రభుత్వానికి చెంపపెట్టాన్నారు. వ్యవసాయాన్ని రక్షించుకో వడానికి న్యాయస్థానాలు సైతం రైతులకు అనుకూలంగా తీర్పులిస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోందని దుయ్య బట్టారు. ప్రభుత్వ విధాలకు వ్యతిరేకంగా వైసిపి, వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. 
క్రిడా కార్యాలయం ఎదుట సిపిఎం, వైసిపి ధర్నా 
రాజధాని పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళగిరి మండలం నిడమర్రు క్రిడా కార్యాలయం వద్ద సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు రైతు సంఘం నాయకులు జి.నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ భూసేకరణ, సమీకరణ పేరుతో రైతుల భూములను కొల్లగొట్టే కుట్రలను ప్రజా పోరాటాలతో ఎదుర్కొంటామన్నారు.
కోటీశ్వరుల లాభాల కోసం ప్రజలెందుకు త్యాగం చేయాలని ప్రశ్నించారు. మాస్టర్‌ప్లాన్‌లో రోడ్లు, విమానాశ్రయాలు, స్విమ్మింగ్‌పూల్‌లు, పార్కులు ఎక్కడెక్కడ వస్తాయో పొందుపరిచారే తప్పా భూములిచ్చిన రైతులకు ఎక్కడ భూములను అప్పగిస్తారో పేర్కొనలేదని విమర్శించారు. ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు శాంతియుతంగా ఆందోళన నిర్వహించామని, ఇదే పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తే క్రిడా అధికారులపై దాడులకు సైతం వెనకాడబోమని హెచ్చరిం చారు. ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రవి, ప్రగతిశీల కార్మికసంఘం నాయకులు కొండారెడ్డి, సిపిఐ ఎంఎల్‌ నాయకులు లక్ష్మారెడ్డి, ఎంపిపి పి.రత్నకుమారి, ఎంపిటిసి ఎం.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ మణెమ్మ, నవులూరు సర్పంచ్‌ బాలాజినాయక్‌, సిపిఎం నాయకులు వై.రాధాకృష్ణ పాల్గొన్నారు.