మావోయిస్టుల డెడ్ లైన్..

కిడ్నాప్‌ చేసిన ముగ్గురు గిరిజన నాయకుల విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు మరో 36 గంటల్లో ముగియనున్నా.. ఇంతవరకూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. దీంతో కిడ్నా్‌పకు గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. సోమవారం విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాక్సైట్‌ తవ్వకాల అంశంపై ప్రభుత్వ వైఖరిని 13వ తేదీలోగా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేయగా, ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కలి మహేష్‌, మామిడి బాలయ్య, వండలం బాలయ్యలను గత సోమవారం కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టులు ఇచ్చిన గడువు మరో 36 గంటల్లో ముగియనుంది.