భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకున్న గ్రీసు ప్రజలు

ఐరోపాలో పతాక స్థాయికి చేరిన తగవులాట గ్రీస్‌కి, దాని రుణదాతలకూ మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో వేస్తున్న ఎత్తులు, పైఎత్తుల పర్యవసానం అని బయటివాళ్లకి అనిపిస్తుంది. నిజానికి ఐరోపా నాయకులు ఈ రుణ రణం మొక్క అసలు స్వభావాన్ని అంతిమంగా బయట పెడుతు న్నారు. దీని విశ్లేషణ అంత ఆనందదాయకంగా ఉండదు. ఇది డబ్బు, అర్థశాస్త్రం కంటే అధికారం, ప్రజాస్వామ్యాలతో ముడిపడిన అంశం.
త్రిమూర్తులైన యూరోపియన్‌ కమిషన్‌, యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐదేళ్ల క్రితం గ్రీస్‌మీద రుద్దిన అర్థశాస్త్రం ఘోరమైన ఫలితాలనిచ్చింది. గ్రీస్‌ స్థూల జాతీయోత్పత్తి 25 శాతం కుంగిపోయింది. మనం ఊహించగల ఏ మహామాంద్యం కూడా ఇంతటి వినాశకరంగా వుండదు. ఉదా హరణకు గ్రీక్‌ యువకులలో నిరుద్యోగం 60 శాతానికి చేరింది.
ఈ పర్యవసానాలలో దేనికీ ఈ మూడు సంస్థలు బాధ్యతవహించటానికి తిరస్కరిం చాయి. వీటి అంచ నాలు, నమూనాలు ఎంత లోపభూ యిష్టమైనవో, వాటిని ఆచరించిన దేశాలు ఎంతగా నష్టపోయాయో తెలిసికూడా ఈ సంస్థలు తమ తప్పులు ఒప్పుకోవ టానికి సిద్ధంగా లేవు. ఐరోపా నాయకులు ఈ అనుభ వాలనుంచి ఏమీ నేర్చుకోే కపోవటాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గ్రీస్‌ తన బడ్జెట్‌లో ప్రాథమిక మిగులు (వడ్డీ చెల్లింపులను మినహా యించి)ను స్థూల జాతీయోత్పత్తిలో 2018 కల్లా 3.5శాతం వుండాలని ఈ ద్రవ్య సంస్థలు ఇంకా షరతులు పెడుతున్నాయి. ఈ నిబంధన అత్యంత దారుణంగా వున్నదని అర్థశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఖండిం చారు. ఎందుకంటే దీనిని ఒప్పుకుంటే గ్రీస్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతుంది. ఒకవేళ గ్రీకు ప్రజలు రుణదాతల షరతులను రిఫరెండంద్వారా ఒప్పుకుని ఉంటే ఆ దేశంలో మాంద్యం అనివార్యంగా కొనసాగేది.
ప్రాథమికంగా వున్న అతి పెద్ద లోటును మిగులుగా మార్చటంలో గత ఐదేళ్లలో గ్రీస్‌ గొప్ప విజయం సాధించింది. గ్రీకు ప్రజల క్షోభ పెరిగినప్పటికీ తట్టుకుని ప్రభుత్వం రుణదాతల షరతులను చాలావరకు అంగీకరించింది.
ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. వాస్తవానికి గ్రీస్‌కిచ్చిన అప్పులో చాలావరకు ఆ దేశాన్ని చేరలేదు. అది ప్రయివేటు రంగ రుణదాతల చెల్లింపులుగా వెళ్ళాయి. వీటిలో ప్రధానంగా జర్మన్‌, ఫ్రెంచ్‌ బ్యాంకులు ఆ డబ్బును ఆరగించాయి. గ్రీస్‌కు చేరింది స్వల్పం. ఐతే ఈ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థలను రక్షించటానికి గ్రీసు చెల్లించింది చాలా ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ఇతర అధికార సంస్థలు గ్రీస్‌ నుంచి డిమాండ్‌ చేస్తున్న డబ్బు నిజానికి వాటికి అవసరంలేదు. వ్యాపారంలో భాగంగా బహుశా ఆ డబ్చును తిరిగి గ్రీస్‌కే అప్పుగా ఇచ్చే అవకాశముంది.
కానీ ఇక్కడ డబ్బు సమస్య కాదు. 'గడువుల'ను ఉపయోగించి గ్రీస్‌ను లొంగదీసుకుని, అంగీకరించలేని షరతులను అంగీకరింపజేయటమే వాటి ప్రధాన ధ్యేయంగా వుంది. ఈ షరతులలో పొదుపు చర్యలే కాకుండా ఇతర తిరోగమన, దండనాత్మక విధానాలు కూడా వున్నాయి. 
అయితే ఐరోపా ఇదంతా ఎందుకు చేస్తున్నది? యూరోపియన్‌ యూనియన్‌ నాయకులు రిఫరెండంను ఎందుకు ప్రతిఘటిస్తున్నారు? అంతర్జాతీయ ద్రవ్యనిధికి జూన్‌30వ తేదీకల్లా గ్రీస్‌ ఇవ్వాల్సిన అప్పును మరికొన్ని రోజులు వాయిదా వేయటానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఐరోపా ప్రజాస్వామ్యం కోసం నిలబడదా?
జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలను విరమిస్తానని వాగ్దానం చేసిన పార్టీని గ్రీస్‌ ప్రజలు గెలిపించారు. తన ఎన్నికల వాగ్దానాన్ని నిలుపుకోవాలని మాత్రమే ప్రభుత్వం చూసినట్లయితే రుణదాతల ప్రతిపాదనలను ఆదిలోనే తిరస్కరించేదే. కానీ తమ దేశ ప్రజల భవిష్య క్షేమానికి కీలకమైన ఈ విషయంపై ఒక అవకాశం ఏదైనా దొరుకకపోతుందా అనే ఆశతో ప్రభుత్వం ఈ ప్రక్రియలో పాల్గొన్నది.
అలా ప్రజామోదం కోసం పాకులాడటం యూరో జోన్‌ రాజకీయాలకు పొసగని విషయం. అదెప్పుడూ ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. యూరోపియన్‌ కేంద్రబ్యాంకుకు తమ ద్రవ్య సార్వభౌమాధికారాన్ని స్వాధీనం చేసే ముందు చాలా దేశాలు ప్రజల ఆమోదాన్ని తీసుకోలేదు. ఆ పని స్వీడెన్‌ చేసింది. ఆ దేశ ప్రజలు కేంద్ర బ్యాంకు ప్రతిపాదన తిరస్కరించారు. కేవలం ద్రవ్యోల్బణం మీదనే తన దృష్టిని కేంద్రీకరించే కేంద్ర బ్యాంకు ఒక దేశ ద్రవ్య విధానాన్ని రూపొందిస్తే నిరుద్యోగిత పెరుగుతుందని వారికి అర్థమైంది. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే యూరో జోన్‌ ఆర్థిక నమూనాతో ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తాయి.
మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగా గత 16 సంవత్సరాల నుంచి యూరో జోన్‌ వ్యవస్థీకృతం చేసిన సంబంధాలన్నీ ప్రజా స్వామ్యానికి వ్యతిరే కమయినవే. అలెక్సీ సిప్రాస్‌ నాయకత్వానగల వామపక్ష ప్రభుత్వాన్ని అంతమొందించాలని చాలా మంది ఐరోపా నాయకులు చూశారు. అసమానతలను పెంచి పోషించిన విధానాలను రద్దు చేయాలని, ఎలాంటి అదుపూలేని ధనస్వామ్యాన్ని నియంత్రించాలనే ప్రభుత్వం గ్రీస్‌లో వుండటం ఈ నాయకులకు చాలా అసౌకర్యంగా వున్నది. గ్రీకు ప్రజలు సిరిజాకు ఇచ్చిన రాజకీయాదేశానికి (మాన్‌డేట్‌కు) భిన్నమైన ఒప్పందానికి గ్రీస్‌ ప్రభుత్వాన్ని ఒప్పించటం ద్వారా దానిని కూలదోయాలనే కుయుక్తి వారు సాగించిన చర్చల సరళిలో నిక్షిప్తమై వుంది.
జులై 5వ తేదీన గ్రీసు ప్రజలు ఓటింగులో షరతులను రాక్షస షరతులను తిరస్కరించారు. ఒక వేళ వారు షరతులను ఆమోదించి ఉంటే ముగింపు లేని మాంద్యాన్ని కోరుకోవటమే అయ్యేది. బహుశా తన సంపదనంతా కోల్పోయిన దేశంగా, విy ేకవంతు లైన తమ యువకులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్ప డిన దేశంగా, ఒక మధ్యస్థ ఆర్థిక వ్యవస్థగా కుదిం పబడిన దేశంగా రాబోయే దశాబ్దకాలంలోను, ఆపైనా గ్రీసు మారిపోయి ఉండేది.
అందుకు భిన్నంగా షరతులను తిరస్కరించింది. బలమైన ప్రజాస్వామిక సంప్రదాయంగల గ్రీస్‌ తన భవితవ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోగలిగింది. గతమంత ఐశ్వర్యం రాకపోయినా తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకునే అవకాశం లభించిన అది లాభపడుతుంది. అది న్యాయంలేని వర్తమానం పెట్టే హింస కంటే మరింత ఆశాజనకంగా వుంటుంది. 

జోసెఫ్‌ స్టిగ్లిజ్‌