ప్రమాద ఘంటిక..

సోమవారంనాటి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద ఘంటిక. దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. నష్టాల సునామీలో మదుపర్లకు చెందిన సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని అంచనా. సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ చరిత్రలో చోటు చేసుకున్న భారీ పతనాల్లో మూడవది. 2008 జనవరి 21 తర్వాత అతి పెద్ద నష్టం. 26 వేల పాయింట్ల దిగువకు చేరడం సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. సెన్సెక్స్‌ అతిపెద్ద పది పతనాల్లో ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించిన 2008లో నమోదయ్యాయి. మళ్లీ ఆ స్థాయికి మార్కెట్లు పడిపోయిన విషయాన్ని గమనించాలి. గెయిల్‌, ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ సహా పలు ప్రఖ్యాత సంస్థల షేర్లు తొమ్మిది నుంచి పదిహేను శాతం మేర నష్టపోయాయంటే ఇక సాదాసీదా కంపెనీల పరిస్థితేంటో ఊహించవచ్చు. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారతీయ కరెన్సీ, రూపాయి విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోవడం ఆందోళనకరం. ఒక్క రోజే 68 పైసలు విలువ కోల్పోయి రూ.66.64కు చేరింది. స్టాక్‌ మార్కెట్‌లో సంక్షోభం వారం రోజుల క్రితం ప్రారంభమై సోమవారానికి పరా కాష్టకు చేరింది. ఆగస్టు 19 నుంచి ఇప్పటి వరకు రూ.9,42,557 కోట్ల విలువ కోల్పోయింది. వరుసగా పతనమవుతున్న రూపాయి మరింత చతికిలపడింది. మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఇచ్చిన భరోసాలు, ప్రకటనలు స్టాక్‌ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. చేసేదిలేక ప్రపంచ మార్కెట్లలో నష్టాల ప్రభావం భారత్‌ మీద కూడా పడిందంటూ సన్నాయి నొక్కులు అందుకున్నారు. పరిస్థితులను సమీక్షించి, తగు చర్యలు తీసుకుంటామంటూ అనివార్యంగా సంక్షోభాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
మన దేశమే కాదు ప్రపంచ మార్కెట్లు అమాంతం కుదేలు కావడానికి అమెరికా, చైనా, యూరప్‌ దేశాలు చేపట్టిన కరెన్సీ వార్‌ ప్రధాన కారణం. కరెన్సీ విలువ తగ్గించుకొని ఎగుమతులు పెంచుకుంటేనే మనుగడ సాగించగలమనే నిర్ణయానికొచ్చాయి ఆ దేశాలు. ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధతను నివారించేందుకు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను వారం క్రితం తగ్గించింది. అక్కడి ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్లకు మద్దతు ఇచ్చేందుకు పెన్షన్‌ నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. షాంఘై, హాంగ్‌సెంగ్‌, నిక్కీ, తైవాన్‌, తదితర మార్కెట్లు సోమవారం ఒత్తిడికి గురయ్యాయి. అభివృద్ధికి చిరునామాగా తనకు తాను కీర్తించుకునే అమెరికాలో ఈ కాలంలో తయారీ రంగంలో వృద్ధి మందగించింది. ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశ తయారీ రంగం రెండేళ్ల కనిష్టానికి పడిపోయిందన్న అంచనాలతో వాల్‌స్ట్రీట్‌ నష్టాలకు గురవుతోంది. ఈ పరిణామాలు భారత్‌ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లను మరింత దిగజారుస్తున్నాయి. ఇక గ్రీసులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ప్రభావం ప్రపంచ మార్కెట్లను పతనం వైపు నెడుతోంది. ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారీగా ధరలు పడిపోతున్నాయి. తాజా ప్రపంచ పరిణామాలతో ముడిచమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల దిగువకు దిగజారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న చైనా సరఫరాలో మందగమనం చమురు ధర పతనానికి కారణమైంది.
శరవేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాలు మరోసారి 1939 నాటి ఆర్థిక సంక్షోభం తప్పదనే సంకేతాలిస్తున్నాయి. 2008 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ బెయిలవుట్‌ వంటి కాయకల్ప చికిత్సలతో అమెరికా, యూరప్‌ దేశాలు నెట్టుకొచ్చాయి. సంక్షోభం సమసిపోయిందంటూ నిర్వహిస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామాలు నయా-ఉదారవాద ఆర్థిక విధానాల బండారాన్ని బయటపెడుతున్నాయి. ఈ విధానాలవల్లే మన దేశం, ప్రపంచం ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభంలోకి వెళుతున్నా పెట్టుబడిదారీ ఆర్థిక పండితులు అవే విధానాలను మరింత లోతుగా అమలు చేయాలని కోరుతున్నారు. అంటే వారు మరింత తీవ్ర సంక్షోభాన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి, ద్రవ్యపెట్టుబడిపై ఆధారపడితే సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ప్రపంచ అనుభవంతోనైనా తెలుసుకోవాలి. ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌డిఐలు, వాటిపై ఆధారపడ్డ మేక్‌ ఇన్‌ ఇండియా జన బాహుళ్యం అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతమాత్రం పనికి రాదని మోడీ సర్కారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.