ప్రజల కోసం ప్రజాశక్తి

ప్రజల పత్రిక ప్రజాశక్తి నేటితో 34 సంవత్స రాలు ముగించుకుని 35వ వసంతంలోకి అడుగిడు తున్నది. ఈ సందరర్భంగా విజయవాడలో నేడు ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 'సమకాలీన పరిస్థితులలో మీడియా' అనే అంశంపై సదస్సు జరుగుతున్నది. పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు కామ్రేడ్‌ ప్రకాశ్‌ కరత్‌, వివిధ తెలుగు దినపత్రికల సంపాదకులు, మాజీ సంపాదకులు శ్రీ కె రామచంద్ర మూర్తి, శ్రీ కె శ్రీనివాస్‌, శ్రీ రాఘవాచారి, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, శ్రీ ఎస్‌ వీరయ్య, శ్రీ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వి కృష్ణయ్య ప్రభృతులు సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సుమారు 20 సంవత్సరాల తరువాత ప్రజాశక్తి హెడ్‌ ఆఫీసు విజయవాడలో మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి, ముఖ్యంగా విజయవాడ చుట్టుప్రక్కల ఏర్పాటౌతున్న అమరావతి రాజధాని ఏరియా ప్రజానీకానికి ఎక్కువ సేవ చేయటానికి తమ సహకారాన్ని అందించాలని అన్ని తరగతుల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
1942లో తెలుగు నేలపై నెలకొల్పబడిన తొలి తెలుగు దినపత్రిక ప్రజాశక్తి. ఉద్యమ ప్రస్థానంతో పాటే పత్రిక ప్రస్థానం నడిచింది. దాంతో బాటే అనేక ఒడిదుడుకులు, నిర్బంధాలు ఎదుర్కొని సామాన్య ప్రజల పక్షాన నిలబడింది. మన ప్రియతమ నేత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారి నేతృత్వంలో శ్రీ మోటూరు హనుమంతరావుగారి సంపాదకత్వంలో 1981 జనవరి 31న ప్రజాశక్తి తన దినపత్రిక ప్రస్థానాన్ని విజయవాడలో తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి పత్రిక అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. దీనికి ప్రజానీకం పూర్తి మద్దతే ఆయువుపట్టు.
సమకాలీన వాస్తవ పరిస్థితులు ప్రజలకు చేరటం లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ఆ పాత్రను సరిగ్గా నిర్వహించవల్సి ఉంది. ఉదాహరణకు మోడీ మొదటి సంవత్సరం పాలనపై నిష్పాక్షికమైన నిర్ధారణలు పత్రికలలో వచ్చింది చాలా తక్కువ. ఈ కాలంలో 300కు పైగా మత కల్లోలాలు దేశవ్యాప్తంగా జరిగాయి. గతంలో లాగా పెద్ద ఎత్తున కాకుండా చిన్నవిగా, క్లౌడ్‌ పద్ధతిలో మతకల్లోలాలు జరపటం కొత్త తరహా పద్ధతి. మేక్‌ ఇన్‌ ఇండియా లోగోను రూ.4.5 కోట్లు పెట్టి విదేశీ కంపెనీచే తయారు చేయించటం చూస్తే మన పాలకులకు స్వదేశీయత ఎంతవుందో అర్థమవుతుంది. ఆ లోగోను విదేశీ సంస్థ ఎక్కడో కాపీ కొట్టి తెచ్చిన విషయాన్ని ప్రజాశక్తి మినహా ఎవరూ రిపోర్టు చేయలేదు.
భూసమీకరణకు-పారిశ్రామీకరణ వెనుక బాటుకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల సర్వేలు తెలుపుతున్నాయి. కొత్తవి పెద్దగా రాకపోయినా ఉన్నవి ఈ సంవత్సరంలో 25,600 పరిశ్రమలు మూతపడినవంటే పరిస్థితి ఎంత తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందో కారణాలను మీడియా విశ్లేషణ చేయాల్సి ఉంది.
దేశం వెలిగిపో తున్నదని నాటి వాజ్‌పేరు ప్రభుత్వం చెప్పగా నేటి మోడీ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సర్వే గ్రామీణ ప్రాంతం ఎంత దివాళాలో ఉన్నదో చెప్పిన వాస్తవాలను పరిశీలించి పాలక వర్గాలను బోనులో నిలబెట్టింది లేదు. 2014లో దేశంలో 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. వీటి కారణాలను, పరిష్కారాలను మీడియా లోతుగా పరిశీలించాలి.
గ్రామీణ ఉపాధి పథకాన్ని కుదించి వ్యవసాయ రంగం సబ్సిడీలను క్రమంగా రద్దు చేయటానికి ఉవ్విళ్ళూరుతున్న దేశ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. ఆర్థిక, సామాజిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి పోతుంటే దాన్నికాపాడే చర్యలపై చర్చించాల్సి ఉంది.
ప్రపంచం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉందని రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ చెప్పిన సలహాలను పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆయన అధికారాలను కుదించాలనే ఆలోచనలను చేస్తున్న దంటే ఎంత నియంతృత్వంగా ఆలోచిస్తున్నదో అర్థమవుతున్నది.
ప్రధాని 21 దేశాలు పర్యటించినా వస్తున్న పెట్టుబడులు చాలా పరిమితంగానే ఉన్నాయి. వారు మన దేశంలో ఏ వస్తువులు అమ్ముడు పోతాయో వాటికి సంబంధించిన పరిశ్రమలనే పెట్టాలను కొంటున్న వాస్తవాలను ప్రజలకు చెప్పటం లేదు. అభివృద్ధి కావాలంటే మెజార్టీ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, అంటే గుట్టలు పడుతున్న సంపదను ఎక్కువ మందికి వివిధ పథకాల ద్వారా చేర్చాలి. ఈ ప్రత్యామ్నాయ వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.
ఈ విధానాల కోసం ప్రజాశక్తి పని చేస్తున్నది. ఈ లక్ష్యాల కోసం అనేక ఒడిదు డుకులను ఎదుర్కొం టున్నది. ఈ భావా లనూ ఆలోచ నలను ఇంకా విస్తృతంగా తీసుకె ళ్ళాలంటే ప్రజాశక్తి ఇంకా బాగా అభివృద్ధి కావాల్సి ఉంది.
ప్రపంచ మీడియాలో నూతన పోకడలు వస్తున్నాయి. టీవీకన్నా విస్తృతంగా నేడు సోషల్‌ మీడియా దూసుకుపోతున్నది. ప్రధానమంత్రి గొప్పగా ప్రకటించిన డిజిటల్‌ విప్లవం గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లో బందీగా ఉన్నంతకాలం అది సమాజంలోని క్రిందిస్థాయికి వెళ్లలేదు. ప్రభుత్వరంగంలో దానిని అభివృద్ధి చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ నూతన ఒరవడులను అన్వయించుకోవడం ద్వారా ప్రజాశక్తి విశాల ప్రజానీకానికి చేరువ కావాల్సి ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు గతం వలే అందించాలని కోరుతున్నాం.
2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం, దేశంలో 22వ స్థానంలో ఉన్నాం. 5వ తరగతిలోపు చదువుతున్న వారు 25 శాతం ఉన్నారు. అంటే సగం మంది అక్షర జ్ఞానానికి ఆమడ దూరంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న వ్యవసాయక రంగం అభివృద్ధి 2.5 శాతంతో, ఆత్మహత్యలతో ఎలా కునారిల్లుతున్నదో అర్థమవుతూనే ఉంది.
విదేశీ పరిశ్రమల రాకకోసం ముఖ్యమంత్రి ఎంతో ఆశతో ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోతుంటే పరిశ్రమలు మనగలగటం, కొత్తవి రాగలగటం కూడ కష్ట సాధ్యమే. ఇటీవల కేందం నుంచి వచ్చిన ఇండిస్టియల్‌ సబ్సిడీ రూ.1,250 కోట్లు చిన్న పరిశ్రమలకు దూరంగా కొద్దిమంది పెద్దవారి ఒడిలో చేరిపోవటానికి కారణం ప్రభుత్వానిది కాదా!
నిన్న మొన్న నీరు-చెట్టు గాని, నేడు ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్‌లుగాని, ఇసుక అమ్మకాల కుంభకోణాలు తమ 
హస్తలాఘవానికి తోడ్పడుతున్నాయి. ఇక ఘనమైన రాజధాని కోసం చేస్తున్న, చేయిస్తున్న అప్పులు గతంలో అమెరికాలాగా, ఇటీవల గ్రీస్‌లాగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడే అవకాశాలున్నాయని ప్రధాన మీడియా అంతగా ఆలోచించటం లేదనిపిస్తున్నది.
విభజన సమస్యను పాలకవర్గాలు తెలుగు జాతి మీద రుద్దగా తెలుగుజాతి ఐక్యత కోసం ప్రజాశక్తి అదురుబెదురు లేకుండా నిక్కచ్చిగా నిలబడింది. శ్రమజీవుల హక్కుల కోసం, వ్యవసాయ రక్షణకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, మహిళల సామాజిక న్యాయం కోసం, శాస్త్రీయమైన విద్య, వైద్య విధానాలు వగైరా కోసం, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడుతున్న ప్రజానీకానికి ప్రజాశక్తి అండగా ఉంటుందని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం.
మరోవైపున మీడియా స్వేచ్ఛకు అంతరాయం కలుగుతున్నది. ప్రజాస్వామానికి మీడియా నాలుగో స్తంభం అని అందరూ అంటుంటారు. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను నిర్వీర్యం చేసే ఘటనలు దేశంలో వెల్లడి అయ్యాయి. అవినీతి, దోపిడీ విచ్చలవిడి అవుతున్నది. ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను దేశంలో కొన్ని చోట్ల బెదిరింపులు, దాడులు, హత్యలకు గురి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో 35 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కడున్నట్లు? రానున్న రోజుల్లో జర్నలిస్టులపై హింసాకాండ మరింత పెచ్చరిల్లే పరిస్థితులు ఎదురు కానున్నాయి. ప్రభుత్వాలు దోషులపై మెతక వైఖరినే అవలంబిస్తున్నాయి. కనుక జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్రం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం కనబడుతున్నది. అందుకు అందరం గొంతు కలపాలి. ఐక్యతను పెంపొందించుకోవాలని కోరుతున్నాను.
- పాటూరు రామయ్య