పోర్టుకి ప్రభుత్వమే అడ్డు:CPM

బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న పోర్టు నిర్మాణ పనులకు రాత్రికిరాత్రే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసి గ్రామాల్లో అలజడి సృష్టించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించవచ్చన్న టిడిపి నాయకులు, ఇప్పుడు 30 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేశారో చెప్పాలని ప్రశ్నించారు. భూములివ్వకపోతే పోర్టు నిర్మాణం జరగదని బెదిరింపులకు దిగడం బాధాకరమన్నారు.పోర్టు పేరుతో 30 వేల ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.ల్యాండ్‌పూలింగ్‌ పెద్ద మోసమని, ఇప్పుడు అదే పేరుతో బందరు ప్రాంత రైతులను మోసగించాలని చూస్తున్నారన్నారు.