పెద్దనోట్ల రద్దుపై హైకోర్టులో వ్యాజ్యం

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి వీలు కలిగిస్తున్న ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌తో పాటు దాని ఆధారంగా జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్రిటీష్‌ కాలంలో ఏర్పడిన ఆర్‌బీఐ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం కొందరికి ముందే తెలుసునని.. దీనివల్ల సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.