పన్ను మదింపుపై దర్యాప్తు జరపాలి

నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు భరించలేని విధంగా పన్నులు పెంచి, అపరాధ రుసుముతో కట్టాలని మున్సిపల్‌ అధికారులు బెదిరింపులకు దిగడం దుర్మార్గమని, తక్షణమే బెదిరింపులు ఆపాలని కోరారు. పన్నుల తగ్గించాలని జరుగుతున్న పోరాటాలకు సిపిఎం మద్దతు తెలియజేస్తుందని చెప్పారు.