నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు!

ఆ గ్రామాలు కాలుష్యానికి చిరునామాలు....! రోగాలకు నిలయాలు.....!! నీటి యుద్ధాలకు నిలువుటద్దాలు....!!! అవి ఎక్కడా అనుకుంటున్నారా! అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల కెక్కిన విశాఖ సమీపంలోని సింహాద్రి ఎన్‌టిపిసి విద్యుత్‌ కర్మాగార చుట్టుప్రక్కల గ్రామాలు. వివిధ పరిశ్రమల విషవాయువుల వల్ల కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న గ్రామాలు, వాటి వల్ల బలౌతున్న ప్రాణుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తీర ప్రాంతంలో సెజ్‌లు, పిసిపిఐఆర్‌లు, విద్యుత్‌ ప్లాంట్లతో ముంచెత్తనున్నట్లు ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల అక్కడ పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల జీవితాలు ఏవిధంగా ఛిద్రమయ్యాయి? వారిని ఏవిధంగా కాపాడాలనే కనీసం ఆలోచనలేని ఈ ప్రభుత్వాలు ఇటువంటి నరకకూపాలనే మరిన్ని మీ మధ్యకు తెస్తాం, భరించండి అని నిస్సిగ్గుగా చెబుతున్నాయి.
రాష్ట్రంలోనే మొదటిదైన అచ్యుతాపురం సెజ్‌లో 1,500 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో 'పూడిమడక సూపర్‌ ధర్మల్‌ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌ కేంద్రం' ఏర్పాటుకు ఆగస్టు12న కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఇప్పటికే పరవాడ సమీపంలో నిర్మించిన రెండు వేల మోగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న కేంద్రప్రభుత్వ ఆధీనంలోని 'సింహాద్రి ఎన్‌టిపిసి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం' వల్ల బలైన గ్రామాలను ఒక్కసారి తడితే అనేక వాస్తవాలు బయటకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్టణాన్ని స్మార్ట్‌ సిటీ చేస్తామని చెబుతుంటే మరోవైపు ఇదే గ్రేటర్‌ విశాఖపట్నంలో భాగంగా ఉన్న సింహాద్రి ఎన్‌టిపిసి నిర్వాసిత గ్రామాలలో కొన్నింటిని చూస్తే హృదయం కలచివేస్తుంది. ఆ గ్రామాలలో ప్రజల కష్టాలను చూస్తే పాలకుల విధానాలకు బలైన వీరి జీవితాలలో వెలుగు ఉంటుందా? అనిపిస్తుంది!
గ్రేటర్‌ విశాఖపట్నంలో భాగంగా ఉన్న, సోమునాయుడుపాలెం, పరవాడ మండలంలోని స్వయంభువరం, మూలస్వయంవరం, కలపాక గ్రామాలను ఇటీవల సిపిఎం బృందం పర్యటించింది. అందులో నేను కూడా పాల్గొన్నాను. పిట్టవానిపాలెంలో ఉదయాన్నే జివిఎంసి వారు పంపించిన వాటర్‌ ట్యాంకర్‌ కోసం ప్రజలంతా ఎదురు చూస్తూంటారు. నీళ్ల ట్యాంకర్‌ వచ్చి ఆగడంతోనే ఖాళీ డ్రమ్ములు, బిందెలు పట్టుకుని ట్యాంకర్‌ వెనుక పరుగులు తీయడం రోజూ ఈ గ్రామంలో సర్వసాధారణ. మంచినీళ్ల ట్యాంకరు వద్ద జరిగే గొడవలలో నెలకు 4-6 కేసులు సమీప పోలీసు స్టేషన్లో నమోదవుతాయంటే ఈ నీళ్ల కోసం ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఊహించుకోవచ్చు. రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగంలోని ''సింహాద్రి ఎన్‌టిపిసి'' విద్యుత్‌ తయారీకి ఉపయోగించిన బొగ్గు వ్యర్థాలు (యాస్‌పాండ్‌) వేస్తున్న ప్రాంతానికి ఈ పిట్టవానిపాలెం అత్యంత సమీపంగా (సుమారు 100 మీటర్ల దూరం) ఉండడంతో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. ఇక్కడ నీరు మనుషులు, పశువులు త్రాగడానికి గానీ, వాడుకోవడానికి సైతం పనికిరావు. ఎన్‌టిపిసి ప్రారంభించి 20 సంవత్సరాలు కావస్తోంది. యాష్‌పాండ్‌ ప్రభావం ప్రత్యక్షంగా చూస్తే గాని అర్థం కాదు. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ అయిన సింహాద్రి ఎన్‌టిపిసి, రోజుకు పది లక్షల టన్నులలో బొగ్గు వ్యర్థాలను, ఇసుక కంటే మొత్తగా ఉండే తెల్లడి బూడిద (ఫ్లైయాష్‌) ను నీటితో కలిపి ఈ పిట్టవానిపాలెం సమీపంలోని యాష్‌పాండ్‌కు పైపుల ద్వారా చేరవేస్తుంది. ఇప్పటికే దీనికోసమై ఉపయోగిస్తున్న 600 ఎకరాలలో సగానికి పైగా ప్రాంతంలో సుమారు 25 మీటర్ల ఎత్తున ఈ బూడిద వచ్చి చేరింది. ఇది రోజూ ఎండ తీవ్రత, గాలి వాటాన్ని బట్టి చుట్టు ప్రక్కల ఉన్న సుమారు ఆరు గ్రామాలపైకి ఎగిరి పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరిగే క్రమంలో బూడిదతో పాటు అనేక ప్రమాదకర రసాయనాలు వాతావరణంలోకి వెదజల్లబడతాయి. మెర్క్యురీ, సల్ఫర్‌డయాక్సైడ్‌, అర్సెనిక్‌, సీసం, కాడ్మియం వంటి ఆరోగ్యానికి హానికలిగించే వ్యర్థాలు మనం పీల్చేగాలిద్వారా, తాగేనీటి ద్వారా, తినే తిండి ద్వారా చేరి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిలోని సల్ఫర్‌ డయాక్సైడ్‌ అత్యంత విషపూరితమైంది. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి మరణాలకు కూడా దారితీస్తుంది. ఈ బూడిద వల్ల ప్రజలు భయంకర వ్యాధులకు గురౌతారని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సైన్స్‌ పరిశోధన నివేదికలో పొందుపర్చింది. అది ఇక్కడ నిజమైంది. ఈ ఎన్‌టిపిసి ద్వారా వచ్చే కాలుష్యం వల్ల చాలా మందికి ఒంటిపై దద్దుర్లు, పెద్ద పెద్ద పుండ్లు వచ్చి చర్మమంతా పాడైపోతున్నది. రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ప్రభావంతో మరింత బక్కచిక్కి 30 ఏళ్ల వారిలో సైతం 15 ఏళ్ల వారి పెరుగుదల కూడా కనిపించడంలేదు. గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో కూడా గ్రామంలో అనేక మంది బాధపడుతున్నారు. ఇంతటి ప్రభావం కలిగిస్తున్న ఈ గ్రామాన్ని ఇక్కడ నుంచి తరలించండి ప్రభో అని ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వాలు కానీ, సింహాద్రి ఎన్‌టిపిసిగానీ కనీసం పట్టించుకోవడంలేదు. 
సింహాద్రి ఎన్‌టిపిసికి కర్మాగారానికి ఆనుకుని ఉన్న మూలస్వయంవరం గ్రామానికి ఈ కంపెనీ శాపంగా మారింది. కంపెనీ నిర్మించిన సుమారు 275 మీటర్ల ఎత్తుగల నాలుగు పెద్ద చిమ్నీలు ఈ గ్రామాన్ని ఆనుకుని ఉంటాయి. కనీస గ్రీన్‌బెల్ట్‌ నిబంధనలకు కూడా నోచుకోకుండా ఈ గ్రామం అత్యంత సమీపంలో ఉండడం వల్ల చిమ్నీల నుంచి వచ్చే నల్లటి బూడిద ఈ గ్రామంపై చాపలా కమ్ముతున్నది. దీంతో యాష్‌పాండ్‌ (బూడిద) ప్రభావంతో పాటు ఈ నల్లటి ధూళితో ఈ గ్రామంలోని అనేక మంది వలసలు పోతున్నారు. ఉన్నవారు రోగాలకు బలౌతున్నారు. ఈ ఏడాదిలోనే ఐదుగురు కేన్సర్‌తో మరణించారు. మరో 20 మంది వరకు కేన్సర్‌, తీవ్రమైన ఊపిరితిత్తులు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధులైతే లేచి నిలబడలేనంత బలహీనంగా ఉన్నారు. తాగేందుకు మండల కేంద్రం నుంచి 20 లీటర్ల నీళ్ల కేన్లను కొని వాడుకుంటున్నారు. ఇలా ఈ ప్రాంతంలోని ఏ గ్రామాన్ని చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఇంతటి తీవ్రత కలిగిన ఈ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఇప్పుడు తీరంలో మరికొన్ని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే దీనికి సమీపంలో ప్రైవేటు రంగంలో 'హిందూజా పవర్‌ప్లాంట్‌' నిర్మాణం జరుగుతున్నది. ఎన్‌టిపిసి విస్తరణలో భాగంగా ప్రక్కనే ఉన్న అచ్యుతాపురం మండలం పూడిమడక రాష్ట్రంలోనే అత్యధిక మత్స్యకారులు నివసిస్తున్న గ్రామం. అంటే దీనివల్ల అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో సుమారు పది గ్రామాలు తీవ్ర కాలుష్యకోరల్లో చిక్కుకుంటాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న విద్యుత్‌ కేంద్రాలకు దీనికి 15 కిలోమీటర్ల మధ్యనున్న ప్రజలు ఎడాపెడా ఈ కాలుష్యాన్ని భరించాల్సిందే. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బ్రాండిక్స్‌, ఫెర్రోఎల్లాయీస్‌, ఫార్మా కంపెనీల వల్ల వీటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. మత్స్య సంపద దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తగా నెలకొల్పబోయే మరో ఎన్‌టిపిసి వల్ల ఈ నష్టంతో పాటు ఇక్కడ పొమ్మనకుండా పొగపెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించనున్నాయి. కొత్తగా పెట్టే థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు రోజుకు 3,600 టన్నుల బూడిద ఉత్పత్తి చేస్తుందని, వివిధ రకాల యాష్‌ (బూడిదలు) 33.6 లక్షల టన్నులు సంవత్సరానికి బయటకు విడుదల చేస్తుందని తన ఇఎఐ నివేదికలోనే పొందిపర్చింది. దీనికి సముద్రం నుంచి రోజుకు 6.70 లక్షల ఘనపు లీటర్ల నీటిని తీసుకుని మరలా అంతే స్థాయిలో వేడి నీటిని సముద్రంలోకి విడుదల చేయడం వల్ల సముద్రపు జీవ జాతులు ఏ స్థాయిలో నాశనమౌతాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన ఈ పరిశ్రమ తీవ్రత ప్రజలకు అర్థమయ్యే ఈ కాలుష్య కంపెనీలను, ప్రజాభిప్రాయ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్న హామీని నెరవేర్చడం లేదు. భూములు కోల్పోయి రైతులు ఇటు ఉపాధి లేక, అటు వ్యవసాయం లేకపోవడంతో ఇటువంటి కాలుష్య పరిశ్రమలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏదైనా పరిశ్రమ పెట్టే ముందు తమ భూములు తీసుకున్న నిర్వాసితులకు, స్థానికులకు సకల సౌకర్యాలు కల్పించి, ఉద్యోగాలిస్తామని, సామాజిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పే కంపెనీలు తీరా పరిశ్రమ పెట్టిన తరువాత అది ప్రభుత్వమైనా, ప్రైవేట్‌ పారిశ్రామికవేత్తలైనా ఎలా వ్యవహరిస్తాయో పై గ్రామాల స్థితిగతులే చెబుతున్నాయి. అందుకే ఇటువంటి వినాశకర అభివృద్ధి పట్ల ప్రజలు చైతన్యం కావాలి. ఒక ప్రజా ఉద్యమం నిర్మించాలి. 
(2015 ఆగస్టు 12న పూడిమడకలో ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా)
వివి శ్రీనివాసరావు
(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా కార్యదర్శి)