చట్టాలన్నీ పెళుసు...పాలకులకు పేదలంటే అలుసు

మన చట్టాలన్నీ పెళుసుబారాయి. పాలకులే వాటిని అమలు చేయని నిందితుల జాబితాలోకి చేరుతున్నారు. చట్టాలు చేసే వారే అమలుకు మీనమేషాలు లెక్కించడం విచిత్రం. అందునా పేదలకు సాయం అందించే చట్టాలంటే వారికి మరీ అలుసు! తాజాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనే అందుకు ఉదాహరణ. మున్సిపల్‌ కార్మికుల్లో 85 శాతం మంది దళిత, గిరిజన పేదలే! వీరు పట్టణాల్లో మురికి, చెత్త, మలిన పదార్థాలను చేతులతో తీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నారు. పాకీ పనితో నిజమైన 'స్వచ్ఛ భారత్‌'ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండేందుకు పనిచేసే ఆ కార్మికులు మాత్రం దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు చాలక పస్తులతో కునారిల్లుతున్నారు. తమ పిల్లలను పోటీ ప్రపంచంలో పెద్ద పెద్ద కార్పోరేట్‌ చదువులు చదివించుకోలేక పోతున్నారు. గత్యంతరం లేక వారినీ ఇదే వృత్తిలోకి నెడుతున్నారు. ఉద్యోగాలు, పనులు లేక ఈ పాకీ వృత్తికి వస్తున్నారు. అనారోగ్యం వస్తే ధర్మాసుపత్రులే వారికి ఆధారం. కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేదు. ప్రజలకు ఆరోగ్యం పంచే కార్మికులు నిత్యం అనారోగ్యాలతో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పెంచుతూ జీవోలు జారీ చేసింది. అవే పనులు చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వారితో సమానంగా జీతాలు పెంచడం లేదు. అది దళిత, గిరిజన, పేదల పట్ల చూపిస్తున్న వివక్ష అనే అనాలి.
కనీస వేతనం రూ.15,432 చెల్లించాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎమ్‌ఆర్‌లందరినీ పర్మినెంట్‌ చేయాలని, పర్మినెంట్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ అకౌంట్లు, హెల్త్‌ కార్డులు, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, స్కూలు స్వీపర్లు, ఇతర పార్ట్‌టైమర్స్‌కు కనీస వేతనాలు వర్తింపచేయాలని, విస్తరిస్తున్న పట్టణాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్‌ కార్మికులు కోరుతున్నారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కరానికి గత 10 రోజులుగా సమ్మెలో ఉన్నారు. వారి ఆందోళనకు కెవిపిఎస్‌, దళిత, గిరిజన, ప్రజా, ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపి సమ్మె పరిష్కారానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
                రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10వ వేతన సవరణ సంఘం కనీస వేతనం రూ.13,000 ప్రకటించింది. ఫిట్‌మెంట్‌ను 26 శాతం సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు 64 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాయి. ఎపి ప్రభుత్వం 30-34 శాతం అంటూ బేరసారాలకు దిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో ఎపి ప్రభుత్వం కూడా అంతే ప్రకటించక తప్పలేదు. ఫలితంగా కనీస వేతనం (బేసిక్‌+డిఎ) కలిపి రు.14,170గా నిర్ణయించారు. దానికి కరువు భత్యం (డిఎ) కలిపితే కనీస వేతనం రూ. 15,432 అవుతుంది. దానికి అనుగుణంగా 2015 ఏప్రిల్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం 46, 47, 48, 49 జీవోలను జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు తమకు వేతనాలు పెరుగుతాయని ఆశించారు. కనీస వేతనం అమల్లోకి వస్తుందని భావించారు. పాలకులు అత్యధిక సంఖ్యలో చేస్తున్న పేదల పని లెక్కలోకి రాకపోవడం గమనార్హం.
                2014 ఎన్నికల మేనిఫె˜స్టోలో తమ పార్టీని గెలిపిస్తే అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కల్పిస్తామని టిడిపి పేర్కొంది. దళిత, గిరిజనులను ఆదుకుంటామని ప్రకటించింది. మిగతా కార్మికులు, మిగతా ఉద్యోగులు లాగే మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, పేదలు ఆ పార్టీనే నమ్మి ఓట్లు వేశారు. కానీ వారి ఆశలను చంద్రబాబు ప్రభుత్వం ఆడియాశ చేసింది. గత ఆరు నెలలుగా 10వ వేతన సవరణ సంఘం సిఫార్సులను ముఖ్యమంత్రి వర్తింప చేయలేదు. దీనిపై పలుసార్లు కార్మిక సంఘాలు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్న వించినా న్యాయం జరగలేదు. గత్యంతరం లేకనే కార్మికసంఘాలు సమ్మెబాట పట్టాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఊరు తగులబడుతుంటే ఎక్కడో ఫియానో వాయించిట్లే ఉంది. ప్రజా సమస్యలు పరిశీలించి పరిష్కరించాల్సిన ప్రభుత్వానికి అవేమీ పట్టలేదు. గోదావరి పుష్కరాల్లో మునిగి తేలుతున్నారు. అక్కడా పాలక నిర్వాకంతో 32 మంది బలయ్యారు.
                పది రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు బాసటగా నిలబడాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యే, కార్పొరేషన్‌ కూడా తమ బాధ్యత మరిచారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా పోటీ కార్మికులను పెట్టి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి కార్మికులపైకి దూసుకొచ్చి రాయడానికి వీలులేని బూతులు తిట్టాడు. అతనిపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలనీ, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కెవిపిఎస్‌ డిమాండు చేస్తోంది. నెల్లూరులో ఓ టిడిపి కార్పొరేటర్‌ పోటీ కార్మికులను పెట్టి అలాగే తూలనాడాడు. గుంటూరులో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా అలాగే వ్యహరించారు. చాలా మున్సిపాలిటీల్లో సిఐటియు, ఎఐటియుసి నాయకులతో పాటు కార్మికులను అరెస్టు చేశారు. శుక్రవారం నాడు కూడా సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న కార్మికులపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం మహిళా కార్మికుల రక్తం చూసింది. మొక్కవోని దీక్షతో ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బతీసేందుకు పాలక పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఓట్లు వేసిన జనంపైనే చిందులు తొక్కుతున్నారు.
                పట్టణాల్లో పారిశుధ్యం దిగజారితే ప్రజారోగ్యానికి మరింత ప్రమాదం కలుగుతుంది. కార్మికులు, దళిత, గిరిజనులు, పేదల సంక్షేమంతోపాటు కోట్లాది మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమ్మె నివారణకు జోక్యం చేసుకొని పరిష్కరించాలి. లేకుంటే కార్మికులకు మద్దతుగా దళిత, గిరిజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఆందోళనకు సమాయత్తం అవుతాయి. ఉద్యమం విస్తృతం కాకముందే ప్రభుత్వం కళ్లు తెరవడం మంచిది.

- ఆండ్ర మాల్యాద్రి 
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)