కేంద్రం కార్మిక చట్టాల నిర్వీర్యనికి కుట్ర

 కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల నిర్వీర్యనికి కుట్ర పన్నుతుందని సిఐటియు ఆలిండియా  ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రుల ఉపసంఘం భేటీ అయ్యింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన శ్రమశక్తి భవన్‌లోఆదివారం జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూస్‌ గోయల్‌, పదకొండు జాతీయ కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సుమారు నలబై నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను మీడి యాకు తపన్‌ సేన్‌ వివరించారు...12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచామని వెల్లడించారు. ఈ డిమాండ్లు ఇప్పటి కావని, గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉనన్నాయని విమర్శించారు. కార్మికుల పట్ల నాటి యుపిఎ అనుసరించిన విధానాలనే నేడు ఎన్‌డిఎ అనుసరిస్తున్నదని తపన్‌ సేన్‌ విమర్శించారు.ఒక పక్క కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతుంటే కార్మిక హక్కులను దెబ్బతీసే విధానాలను కేంద్రం చేపడుతోందని. కార్మిక హక్కులను, డిమాండ్లను పూర్తి స్థాయిలో అమలు పరచాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. ఇప్పటికైనా కేంద్రం చిత్త శుద్దితో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై భవిష్యత్‌లో విస్తృత చర్చలు జరగాలని కార్మిక సంఘాలు కోరినట్లు ఆయన తెలిపారు.