కార్మికహేళన పాలన:నర్సింగరావు

 విశాఖ జిల్లాలోని పలు ప్రయివేటు పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు విమర్శించారు. తెలుగుదేశం పాలన పూర్తిగా కార్మిక హేళనకు మచ్చుతునకగా ఉందని అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 28న గంగవరం పోర్టులోనూ, పరవాడ ఫార్మాసిటీ సాయినార్‌ కంపెనీల్లోనూ ప్రమాదాలు జరిగి ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు. ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోగా విప్‌ల సదస్సులో పాల్గొనడానికి విశాఖ విచ్చేసిన చంద్రబాబు కార్మిక పోరాటాలను అణచివేస్తామని చెప్పడం ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. భద్రతా చర్యలు తీసుకునేలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అక్కడి ప్రభుత్వంతో పోరాడుతుందని చెప్పే చంద్రబాబు, ఈ రాష్ట్రంలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.