కాంగ్రెస్‌ గతే బిజెపికీ:CPM

రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని, రాష్ట్రవిభజన బిల్లులో హామీలు నెరవేర్చాలని కోరుతూ మంగళవారం ది బెజవాడ బార్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహాదీక్షకు సిపిఎం పూర్తి మద్దతు తెలిపింది. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ నేతృత్వంలో సిపిఎం బృందం మంగళవారం నిరాహాదీక్ష చేస్తున్న బార్‌ అసోసియేషన్‌ నాయకులకు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటతప్పారని విమర్శించారు. సమైక్యాంద్రను విడగొట్టి ఆంధ్రరాష్ట్రానికి కాంగ్రెస్‌ ఒకవైపు నష్టం చేస్తే, ఈరోజు బిజెపి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పి ఆంద్రరాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో బిజెపికీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వం ప్రజానీకాన్ని కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని నిలదీయడానికి సిపిఎం ప్రయత్నించిందని, పోలీసులతో అరెస్టులు చేయించి జైల్‌లో పెట్టారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ రెండు మంత్రిపదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా లేక రాష్ట్రప్రయోజనాల కోసం ప్రజల పక్షాన నిలబడతారా తేల్చుకోవాలని ప్రశ్నించారు.