ఈనెల24న రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 24న పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓడిసి నుండి కొండకమర్ల వరకు ఐదు గ్రామాల్లో పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ఏపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రఘువీరారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన అనంతపురం జిల్లా పర్యటన గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అదేరోజు డబురవాలి పల్లిలో మహిళా డ్వాక్రా సంఘాలతో సమావేశమై మహిళల సమస్యలపై చర్చిస్తారన్నారు. రాహుల్ గాంధీ ఆ తరువాత కొండకమర్ల గ్రామంలో వలసవెళ్లగా మిగిలిన వృద్ధులు, కూలీలతో సంభాషిస్తారన్నారు. ఆయన గ్రామీణ ప్రాంతాల దుస్థితి గురించి రైతులతో చర్చిస్తారని రఘువీరారెడ్డి వివరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, చేనేత కార్మికులకు చెందిన 70 కుటుంబాలకు రాహుల్ గాంధీ చేతుల మీదుగా చెక్కులు అందజేస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.